విశాఖ జిల్లాలో విషాదం
పద్మనాభం (భీమిలి): విశాఖ జిల్లా పద్మనాభం మండలం ఇసకలపాలెంలో ఆదివారం విద్యుదాఘాతానికి ఇద్దరు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. విజయనగరం జిల్లా డెంకాడ మండలం గొండయ్యపాలేనికి చెందిన తాపీ మేస్త్రీ కంటుబోతు శ్రీను (34), ఇసకలపాలేనికి చెందిన మరో మేస్త్రీ కాళ్ల సూరీడు (60), ఆయన కుమారుడు సూరిబాబు ఇసకపాలెంలో రేకుల షెడ్డు నిర్మిం స్తున్నారు. కొలతలు తీసుకుంటున్న సమయంలో, అక్కడే అడ్డుగా ఉన్న ఒక పొడవైన ఇనుప పోల్ను పక్కకు జరిపేందుకు యత్నించారు.
ఈక్రమంలో పైన ఉన్న హైటెన్షన్ విద్యుత్ లైన్ల నుంచి ఇనుప పోల్కు విద్యుత్ ప్రసరించడంతో శ్రీను, సూరీడు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మరణించారు. సూరిబాబు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన సూరిబాబును 108లో విజయనగరం మహారాజా ఆస్పత్రికి తరలించా రు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం భీమిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తాపీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న శ్రీనుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతని మరణంతో వారి కుటుంబం రోడ్డున పడింది. సూరీడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. సూరీడు మరణం, సూరిబాబుకు గాయాలు కావడంతో ఆ కుటుంబ సభ్యులూ కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


