ఆనందపురం: పాలవలస పంచాయతీ దుక్కవానిపాలెం టోల్ ప్లాజా వద్ద గురువారం 14 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు ఎస్ఐ శివ, ట్రాఫిక్ ఎస్ఐ పాపారావు తమ సిబ్బందితో కలిసి టోల్ప్లాజా వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఆనందపురం నుంచి పెందుర్తి వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా.. ఒక్కొక్కటి రెండు కిలోల బరువున్న ఏడు ప్యాకెట్లలో మొత్తం 14 కిలోల గంజాయి లభ్యమైంది. గంజాయితో పాటు రవాణాకు ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులను మహారాష్ట్రలోని థానే జిల్లా బడ్లపూర్కు చెందిన సునీల్ నాగేష్ బండారి, ఒడిశాలోని గజపతి జిల్లాకు చెందిన అనిశాంత్ బెహరాలుగా గుర్తించారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.


