మహారాణిపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందే ప్రతి వినతిని అధికారులు సత్వరంగా పరిశీలించి, నాణ్యమైన పరిష్కారం అందించాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి శాఖాధిపతి తన శాఖకు సంబంధించిన వినతులపై వ్యక్తిగత పర్యవేక్షణ ఉంచాలని, ఫిర్యాదుదారులతో నేరుగా ఫోన్లో మాట్లాడి సమస్య తీవ్రతను తెలుసుకోవాలని సూచించారు. ముఖ్యంగా భూ వివాదాలు, పెన్షన్లు, రేషన్ కార్డులు, ఉపాధి వంటి అంశాలపై వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యతనిచ్చి నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలన్నారు. పీజీఆర్ఎస్కు మొత్తం 285 వినతులు అందాయి. సాధారణ పీజీఆర్ఎస్కు వచ్చిన 224 వినతులలో జీవీఎంసీకి సంబంధించి 88, పోలీస్ శాఖకు 19, ఇతర శాఖలకు 117 ఉన్నాయి. రెవెన్యూ క్లినిక్ ద్వారా మరో 61 దరఖాస్తులు అందాయి. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, ఇన్చార్జి డీఆర్వో సత్తిబాబు, ఏడీసీ సత్యవేణి, విశాఖ, భీమిలి ఆర్డీవోలు, ఇతర మండల తహశీల్దార్లు పాల్గొన్నారు.


