వైభవంగా అనంతుని తెప్పోత్సవం
పద్మనాభం: అనంత పద్మనాభ స్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన ఆదివారం రాత్రి స్వామి తెప్పోత్సవం కనులపండువగా జరిగింది. కుంతీ మాధవ స్వామి ఆలయంలో కొలువై ఉన్న శ్రీదేవి, భూదేవి సమేత అనంత పద్మనాభ స్వామి ఉత్సవ విగ్రహాలను పద్మనాభం జంక్షన్కు సమీపంలో(విజయనగరం–శొంఠ్యాం ఆర్అండ్బీ రోడ్డు పక్కన) ఉన్న అనంత పద్మనాభ స్వామి పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఇక్కడ స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. తదుపరి కొత్తగా తయారు చేసిన హంస వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత అనంత పద్మనాభ స్వామి ఉత్సవ విగ్రహాలను వేంచేపు చేశారు. అనంతరం తెప్పోత్సవం వైభవంగా ప్రారంభమైంది. ఉభయ దేవేరులతో కలిసి అనంత పద్మనాభ స్వామి హంస వాహనంపై మూడుసార్లు పుష్కరిణిలో జలవిహారం చేశారు. భక్తుల గోవింద నామస్మరణల మధ్య స్థానిక జాలర్లు తెప్పను తాళ్లతో లాగగా ఈ ఉత్సవం కనులవిందుగా సాగింది. తెప్పోత్సవాన్ని తిలకించడానికి వచ్చిన భక్తులతో పుష్కరిణి గట్టు కిక్కిరిసిపోయింది. కార్యక్రమంలో ఎంపీపీ కంటుబోతు రాంబాబు, ఎమ్మెల్యే గంటా తనయుడు రవితేజ, భక్త బృందం సభ్యులు తాలాడ పద్మనాభం, కాళ్ల నగేష్ కుమార్, కశిరెడ్డి దామోదరరావు, కృష్ణాపురం ఎంపీటీసీ సభ్యురాలు కంటుబోతు లక్ష్మి, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తెప్పోత్సవాన్ని కనులారా వీక్షించారు.
వైభవంగా అనంతుని తెప్పోత్సవం


