మహారాణిపేట: జిల్లాలో విద్యుత్ రంగ అభివృద్ధి పనులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా తదితర అంశాలపై ఎంపీ ఎం.శ్రీభరత్ బుధవారం సమీక్షించారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో జరిగిన జిల్లా విద్యుత్ కమిటీ సమావేశంలో కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ముందుగా జిల్లాలో అమలు చేస్తున్న పథకాలు, కొనసాగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్ వివరించి, 11 మండలాల ప్రజలకు నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందిస్తున్నామని తెలిపారు. వినియోగదారుల సమస్యలను వేగంగా పరిష్కరించేలా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పీఎం సూర్యఘర్–ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. అలాగే పీఎం కుసుమ్ పథకం ఉద్దేశాలను ప్రచారం చేస్తూ, వ్యవసాయ రంగంలో సోలార్ విద్యుత్ వ్యవస్థలను ప్రోత్సహించాలని సూచించారు. భూగర్భ విద్యుత్ కేబుల్ పనులు, ఈహెచ్టీ సబ్స్టేషన్లు, 33/11 కేవీ సబ్స్టేషన్ల పనుల పురోగతిని సమీక్షించిన ఎంపీ.. పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ ఆర్డీఎస్ఎస్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ, విద్యుత్ నష్టాల తగ్గింపు, స్మార్ట్ మీటరింగ్, మౌలిక సదుపాయాల బలోపేతంపై దృష్టి సారించాలని సూచించారు. డిస్కం ఎస్ఈ శ్యాంబాబు, ట్రాన్స్కో ఎస్ఈ శివరామ కృష్ణ, ఈఈలు ధర్మరాజు, శ్రీనివాసరావు, వీకే నాయుడు, సింహాచలం నాయుడు, డీఈఈ సుమన్ తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ శ్రీ భరత్


