మహారాణిపేట: రాష్ట్రంలో 12వ పీఆర్సీ కమిషన్ నియామకంతో పాటు, మధ్యంతర భృతిని తక్షణమే ప్రకటించాలని జిల్లా జేఏసీ నూతన చైర్మన్, ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు కె.ఈశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం జరిగిన జేఏసీ నూతన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు.పెండింగ్లో ఉన్న ఉద్యోగుల బకాయిల విడుదల చేయాలని, పెండింగ్లో ఉన్న నాలుగు విడతల డీఏలను మంజూరు చేయాలని, పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల హక్కుల సాధన కోసం భవిష్యత్తులో సంఘటితంగా పోరాడాలని జేఏసీ కో–చైర్మన్ ఎం.రవికుమార్ పిలుపునిచ్చారు.
జిల్లా జేఏసీ నూతన కార్యవర్గం ఎన్నిక
ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు, పెన్షనర్ల సంఘాలతో కూడిన జిల్లా జేఏసీ కార్యవర్గాన్ని ఈ సందర్భంగా పునర్ వ్యవస్థీకరించారు. నూతన చైర్మన్గా కె.ఈశ్వరరావును ఎన్నుకున్నారు. కో–చైర్మన్లుగా ఎ.కె.శివాజీ, ఈ.పైడిరాజు, ఎం.రవికుమార్, వైస్ చైర్మన్లుగా కరుణకుమార్, జి.శ్రీను, టి.భవాని, డి.డి.ప్రసాదరావు, బి.హరినాధరావు, కార్యదర్శిగా ఎం.శ్రీను (పీఆర్టీయూ), కోశాధికారిగా పి.అప్పలరాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఏవీఎస్ఎస్వీ సుబ్రహ్మణ్యం, జాయింట్ కార్యదర్శులుగా పి.వి.కిరణ్, కె.ఆనందకుమార్, బి.వెంకటరావు, కె.జగదీష్కుమార్, జి.రవికుమార్, పలువురు కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు.


