ఏయూలో మరో ఉద్యమ జ్వాల
మొన్న ఎస్ఎఫ్ఐ–ఏబీవీపీ వివాదం.. నేడు టీటీఏల నిరసనోద్యమం
ఆందోళనలకు కేంద్రంగా రిజిస్ట్రార్ కార్యాలయ ప్రాంగణం
వరుస ఘటనలతో కలవరంలో విద్యార్థి లోకం
అడ్డుకట్ట వేయడంలో ఏయూ అధికారుల వైఫల్యం..!
గోరుచుట్టుపై రోకలిపోటు‘ అన్నట్లుగా.. ఇప్పటికే అనేక సమస్యలతో సతమతమవుతున్న ఆంధ్రవిశ్వవిద్యాలయానికి, తాజా వివాదాలు తీరని శాపంగా మారాయి. ‘చెట్టు ముదిరితే గాలికి తట్టుకుంటుంది కానీ, లోపల పుచ్చు పడితే కుప్పకూలుతుంది‘ అన్నట్లుగా.. బయటకి శతాబ్ది ఉత్సవాల హంగులు కనిపిస్తున్నా, లోపల రగులుతున్న వరుస పోరాటాలు వర్సిటీ పునాదులను కదిలిస్తున్నాయి.
విశాఖ సిటీ: వందేళ్ల ఘన చరిత్ర.. వేలమంది మేధావులను తీర్చిదిద్దిన ఆంధ్ర విశ్వవిద్యాలయం నేడు వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. ఒకప్పుడు క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన ఈ ప్రాంగణం.. ఇప్పుడు నిరసనల హోరుతో, నినాదాల జోరుతో కుదేలవుతోంది. ఎటు చూసినా గొడవలు, ఎక్కడ చూసినా ఆందోళనలతో ఏయూ ప్రాంగణం రణరంగాన్ని తలపిస్తోంది. వర్సిటీలో జరుగుతున్న వరుస పరిణామాలు విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి.
పురుగుల భోజనం ఘటన ఒకసారి, ఆక్సిజన్ సిలిండర్ అందుబాటులో లేక విద్యార్థి మృతి మరోసారి, ఫీజులు చెల్లించలేదని మెస్లకు తాళాలు వేయడం ఇంకోసారి.. ఇలా వివాదాలు వరుసగా చెలరేగుతున్నాయి. ఇటీవల ఎస్ఎఫ్ఐ–ఏబీవీపీ విద్యార్థి సంఘాల మధ్య ఆధిపత్య పోరు, తాజాగా వేతనాల కోసం గెస్ట్ ఫ్యాకల్టీల నిరసనలు.. ఇవన్నీ కలిసి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాన్ని కలవరపెడుతున్నాయి. ఒక సమస్య పరిష్కారం కాకముందే మరొకటి తెరపైకి రావడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది.
ఏయూలో చల్లారని మంటలు
గత కొద్దిరోజులుగా ఏయూలో ప్రశాంతత కనబడడం లేదు. విద్యార్థి సంఘాలైన ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ మధ్య ప్రారంభమైన ఘర్షణలు ఇంకా పూర్తిగా చల్లారలేదు. నాలుగు రోజుల పాటు పోటాపోటీ ఆందోళనలతో అట్టుడికిన పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతల మధ్య తాత్కాలిక బోధనా సిబ్బంది (టీటీఏలు) కూడా నిరసన బాట పట్టారు. ఒక సమస్యకు పరిష్కారం లభించకముందే మరో ఉద్యమం మొదలవ్వడం వర్సిటీ పరిపాలనా వైఫల్యాన్ని సూచిస్తోంది.
పరిపాలన భవనం ఎదుట నిత్యం ఆందోళనలు జరుగుతున్నా, వాటిని సమర్థంగా అదుపు చేసే చర్యలు కనిపించడం లేదు. ఏయూలో సుమారు 247 మంది గెస్ట్ ఫ్యాకల్టీలు పనిచేస్తున్నారు. నోటిఫికేషన్ ప్రకారం బోధించే సబ్జెక్టును, బోధనా గంటలను ఆధారంగా తీసుకుని గౌరవ వేతనం చెల్లించేలా ఒప్పందంతో నియమించబడ్డారు.
అయితే, పెరుగుతున్న జీవన వ్యయాల నేపథ్యంలో గంటల వారీ చెల్లింపులకంటే నెలవారీ స్థిర జీతం, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు నోటిఫికేషన్ నిబంధనల ప్రకారమే వేతనాలు ఇస్తున్నామని చెబుతున్నా, గౌరవప్రదమైన జీవనానికి సరిపడే జీతం కావాలని గెస్ట్ ఫ్యాకల్టీలు పట్టుదలగా నిలుస్తున్నారు. గత 12 రోజులుగా పరిపాలన భవనం ఎదుట ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ, స్పష్టమైన పరిష్కారం కనిపించడం లేదు.
భద్రత లోపం..
పరిపాలన భవనం ముందు వరుస నిరసనలు జరగడం ఆందోళన కలిగించే విషయం. తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళనకారులు పలుమార్లు భవనంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు పునరావృతమవుతున్నప్పటికీ, కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
పరిపాలన భవనానికి ఎదురుగానే వర్సిటీ సెక్యూరిటీ కార్యాలయం ఉన్నప్పటికీ, నిరసనకారులను అడ్డుకునే చర్యలు ప్రభావవంతంగా కనిపించడం లేదు. భద్రతా సిబ్బంది, పోలీసులు ఉన్నా, ఆందోళనల సమయంలో పరిస్థితి అదుపులోకి రావడం లేదు. గతంలో ఏర్పాటు చేసిన భారీ ఇనుప రక్షణ కంచెను రాజకీయ కారణాలతో తొలగించడంతో, అప్పటి నుంచి పరిపాలన భవనం ఆందోళనలకు కేంద్రబిందువుగా మారింది.
శతాబ్ది ఉత్సవాల వేళ.. ప్రతిష్ట గాలిలో..!
త్వరలోనే ఏయూలో రెండు ముఖ్య ఘట్టాలు జరగనున్నాయి. మార్చిలో స్నాతకోత్సవం, ఏప్రిల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘శతాబ్ది ఉత్సవాలు’ నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వందేళ్ల పండుగను ఘనంగా జరపాల్సిన ఈ సమయంలో విశ్వవిద్యాలయం వరుస వివాదాలతో వార్తల్లో నిలవడం బాధాకరం. విదేశాల నుంచి వచ్చే అతిథుల సమక్షంలో ఈ వివాదాలు సంస్థ ప్రతిష్టను దెబ్బతీస్తాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
విద్యార్థుల చదువులు అంతరాయానికి గురవుతూ, సిబ్బంది నిరసనలు కొనసాగుతూ, పరిపాలనా నిర్లక్ష్యం కనిపిస్తే ఏయూ భవిష్యత్తుపై ప్రశ్నార్థక పరిస్థితి నెలకొనే ప్రమాదం ఉందని విద్యావర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వందేళ్ల వారసత్వాన్ని కాపాడాల్సిన ఈ కీలక సమయంలో, సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించి ప్రశాంత వాతావరణం నెలకొల్పడం వర్సిటీ అధికారుల ముందున్న అతిపెద్ద సవాలుగా మారింది.


