ఐజీ సునీల్నాయక్కు బిహార్ ప్రభుత్వం అండ
బీఎన్ఎస్ఎస్–218 కింద రక్షణ
తమ అనుమతిలేకుండా ఆయనపై చర్యలు తీసుకోకూడదని స్పష్టీకరణ
కేంద్ర బలగాల అధికారులకు నిర్దేశించిన రక్షణ వర్తింపు..
నోటిఫికేషన్ జారీచేసిన ఆ రాష్ట్ర హోంశాఖ
సాక్షి, అమరావతి : చంద్రబాబు రెడ్బుక్ రాజ్యాంగ అరాచకానికి బిహార్ ప్రభుత్వం చెంపపెట్టులాంటి గట్టి ఝలక్ ఇచ్చింది. ఏపీ పోలీసు అధికారులు బిహార్ కేడర్ ఐజీ సునీల్నాయక్ను అరెస్టుచేసేందుకు ఆ రాష్ట్ర రాజధానిలో హంగామా చేయడంపై తీవ్రంగా స్పందించింది. తమ రాష్ట్ర కేడర్కు చెందిన పోలీసు అధికారులపై ఇతర రాష్ట్రాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా తమ ప్రభుత్వ ముందస్తు అనుమతి తప్పనిసరని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఆ రాష్ట్ర హోంశాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీచేసింది.
బిహార్ కేడర్ అధికారులు డెప్యుటేషన్పై ఇతర రాష్ట్రాల్లో నిర్వహించిన విధులపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా కేసులు నమోదు చేయాలనుకుంటే తమ అనుమతి తప్పనిసరని ఆ నోటిఫికేషన్లో స్పష్టంచేసింది. అంతేకాదు.. ఆ అధికారులపై చర్యలు తీసుకునేందుకు వీలుగా తాము అనుమతించాలంటే పాటించాల్సిన నిబంధనలను కూడా వెల్లడించింది. కేంద్ర పోలీసు బలగాలకు చెందిన అధికారులకు వర్తించే అన్ని రకాల రక్షణ చర్యలు బిహార్ ప్రభుత్వ అధికారులకు వర్తిస్తాయని పేర్కొంది.
అంటే.. కేంద్ర బలగాలకు చెందిన అధికారులపై ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా కేసు నమోదుచేయాలంటే అనుసరించాల్సిన నిబంధనలను తమ అధికారుల విషయంలోనూ పాటించాల్సిందేనని తేల్చిచెప్పింది. అంతేగానీ.. ఇతర రాష్ట్రాల పోలీసులు బిహార్ వచ్చి తమ అధికారులను ఏకపక్షంగా అరెస్టు చేయడం, ఇతరత్రా చర్యలు తీసుకోడానికి వీల్లేదని కుండబద్దలు కొట్టింది. అందుకోసం బిహార్ కేడర్ అధికారులకు బీఎన్ఎస్ఎస్ చట్టం 218 కింద రక్షణ కల్పిస్తున్నట్లు ఆ నోటిఫికేషన్లో ప్రకటించింది.
చంద్రబాబు ప్రభుత్వానికి చెంపపెట్టు..
బిహార్ ప్రభుత్వ చర్య చంద్రబాబు ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదే. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తప్పుడు ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన అక్రమ కేసులో ఐజీ సునీల్నాయక్ను వేధించేందుకు ఏపీ పోలీసులు తెగబడ్డారు. ఈ కేసు దర్యాప్తు అధికారి ఎస్పీ దామోదర్ తన బృందంతో పాట్నా వెళ్లి ఏకంగా ప్రస్తుతం బిహార్లో అగి్నమాపక, హోంగార్డుల విభాగం ఐజీగా ఉన్న సునీల్నాయక్ నివాసంలోకి గోడదూకి వెళ్లి అక్రమంగా అరెస్టు చేసేందుకు యతి్నంచింది. అయితే ఆ రాష్ట్ర పోలీసులు వీరి ప్రయత్నాలను తిప్పికొట్టారు.
ఈ కేసును విచారించిన పాట్నా సివిల్ కోర్టు ఏపీ పోలీసులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. సునీల్నాయక్ను అరెస్టుచేసి తీసుకువెళ్లేందుకు ట్రాన్సిట్ వారెంట్ జారీకి నిరాకరించింది. అయినా.. ఎస్పీ దామోదర్ టీడీపీ అనుకూల మీడియా ద్వారా దుష్ప్రచారం సాగించారు. సునీల్నాయ క్ను తాము అరెస్టుచేసినట్లు ప్రకటించారు.
మరోవైపు న్యాయస్థానం తిరస్కరించినా సునీల్నాయక్ను ఏపీకి తీసుకొచ్చేందుకు దామోదర్ తనబృందంతో పాటా్నలోనే మకాం వేయడం గమనార్హం. అంతేకాదు.. ఆయన నివాసం, ఆఫీసుపై ఏపీ పోలీసులు నిఘా పెట్టారు. సునీల్ నాయక్ ఆఫీసుకు రావడంలేదని, ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకున్నారని టీడీపీ అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేశారు.
రంగంలోకి బిహార్ సీఎం..
ఈ పరిణామాలపై బిహార్ పోలీసు ఉన్నతాధికారులు రగిలిపోయారు. నిబంధనలకు విరుద్ధంగా ఏపీ పోలీసులు బిహార్లో మాటువేసి మరీ అరాచకానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇదే విషయాన్ని తమ సీఎం నితీశ్కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారం యావత్ బిహార్ పోలీసు శాఖ ప్రతిష్టకు సంబంధించినదిగా ఆయన భావించారు. దీంతో బిహార్ పోలీసు అధికారులపై ఇతర రాష్ట్రాలు అక్రమంగా చర్యలు తీసుకోకుండా తగిన ఆదేశాలు జారీచేయాలని ఆదేశించారు.
ఫలితంగా.. బీఎన్ఎస్ఎస్–218 కింద బిహార్ పోలీసు అధికారులకు రక్షణ కల్పిస్తూ ఆ రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ పరిణామాలతో ఎస్పీ దామోదర్ తన బృందంతో వెనుదిరుగుతారా.. లేక అక్కడే మాటువేసి మళ్లీ దుస్సాహసానికి తెగబడతారా అన్నది చూడాలి.


