ఊబిలో పడి యువకుడి మృతి
గాజువాక : చేపలు పట్టడానికి చెరువుకు వెళ్లిన ఒక యువకుడు ప్రమాదవశాత్తు ఊబిలో దిగి దుర్మరణంపాలయ్యాడు. గాజువాక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజువాక హైస్కూల్ రోడ్ ప్రాంతానికి చెందిన బండ అప్పన్న బాబు (35) ప్రతిరోజూ నాతయ్యపాలెంలోని కృష్ణమహంతి చెరువుకు వచ్చి చేపలు పడుతుంటాడు. శుక్రవారం కూడా ఎప్పటిలాగే చెరువుకు వచ్చిన అప్పన్నబాబు చేపలు పడుతున్న క్రమంలో కాలుజారి చెరువులో పడిపోయాడు. ఆ ప్రాంతంలో ఊబి ఉండటంతో ఊపిరి ఆడక మృతి చెందినట్టు స్థానికులు పోలీసులకు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాథమిక వివరాలను సేకరించిన అనంతరం మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.


