ఏఎంసీకి వృద్ధురాలి పార్థివదేహం అప్పగింత
అల్లిపురం: ఏయూటీడీ–టీఎస్ఆర్ కాంప్లెక్స్ నిరాశ్రయుల వసతి గృహంలో ఆశ్రయం పొందుతున్న గౌరమ్మ (80) అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. ఆమె మృతదేహాన్ని ఆంధ్ర మెడికల్ కాలేజీ అనాటమీ విభాగం విద్యార్థుల పరిశోధనలకు ఉపయోగపడేలా ఏయూటీడీ కార్యదర్శి ప్రగడ వాసు కళాశాల అధికారులకు అప్పగించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గత ఏడాది మార్చిలో రైల్వే పోలీసులు ఇచ్చిన సమాచారంతో ఏయూటీడీ సిబ్బంది గౌరమ్మను రక్షించి, జీవీఎంసీ టీఎస్ఆర్ కాంప్లెక్స్ మహిళా షెల్టర్ హోమ్కు తీసుకొచ్చారు. అనారోగ్యంతో ఉన్న ఆమెను చికిత్స నిమిత్తం ఇటీవల కేజీహెచ్లో చేర్పించారు. వృద్ధాప్య సమస్యలతో చికిత్స పొందుతూ ఆమె అక్కడే మరణించారు. ఆమెకు బంధువులెవరూ లేకపోవడంతో మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. అనంతరం ఆంధ్ర మెడికల్ కాలేజీ వైద్యులకు సమాచారం అందించి, టూ టౌన్ కానిస్టేబుల్ కన్నారావు పర్యవేక్షణలో ప్రగడ వాసు సమక్షంలో మృతదేహాన్ని అనాటమీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ రాధారమణికి అందజేశారు. వైద్య విద్యార్థుల కోసం దేహాన్ని అందజేయడంలో సహకరించినందుకు టూ టౌన్ పోలీసులు, ఏయూటీడీ సిబ్బందికి ప్రొఫెసర్ ధన్యవాదాలు తెలిపారు.


