వీఎంఆర్డీఏ కమిషనర్ ఆదేశం
విశాఖ సిటీ: పర్యాటక ప్రదేశాల్లో నిర్మాణాలకు సంబంధించిన అనుమతులను సత్వరమే మంజూరు చేసి, పెట్టుబడిదారులు పనులు త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్.తేజ్భరత్ అధికారులను ఆదేశించారు. గురువారం వీఎంఆర్డీఏ సమావేశ మందిరంలో ఎయిర్పోర్ట్, యూసీడీ, జీవీఎంసీ, ఏపీఈపీడీసీఎల్, అటవీ తదితర శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. గతేడాది విశాఖలో నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న 43 పర్యాటక ఒప్పందాల అమలు తీరుపై ఈ సందర్భంగా సమీక్షించారు. ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన అనుమతులను నేవీ, ఎయిర్పోర్ట్ అథారిటీ, జీవీఎంసీ వంటి సంస్థలు సకాలంలో మంజూరు చేయాలని కమిషనర్ సూచించారు. ఏవైనా అడ్డంకులు ఎదురైతే శాఖల మధ్య సమన్వయంతో వాటిని అధిగమించి ముందుకు సాగాలన్నారు. సమావేశంలో సీఏవో హరిప్రసాద్, జిల్లా పర్యాటక శాఖాధికారి మాధవి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.


