సాగర తీరాన సప్తపది | Destination weddings are growing in popularity | Sakshi
Sakshi News home page

సాగర తీరాన సప్తపది

Feb 27 2026 3:05 AM | Updated on Feb 27 2026 3:05 AM

Destination weddings are growing in popularity

నయా ట్రెండ్‌.. డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ 

ఆహ్లాదకర వాతావరణం, ప్రశాంతత వైపు మొగ్గు   

వధూవరుల సమీప బంధువులు, ఆత్మీయులకే చోటు 

తీర ప్రాంతాలు.. నదీనదాలు.. రిసార్టులే వేదికలు 

ఆనక బంధుమిత్రుల కోసం రిసెప్షన్లు 

విజయవాడకు చెందిన రమేష్‌ అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. విశాఖకు చెందిన అంజలి హైదరాబాద్‌లో ఆర్కిటెక్ట్‌. వారిద్దరూ తమ వివాహం కేవలం ఒక ఫంక్షన్‌ హాల్‌కే పరిమితం కాకుండా కుటుంబ సభ్యులందరితో కలిసి మూడు రోజులపాటు పండుగలా చేసుకోవాలని విశాఖపట్నం తీరాన్ని డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ వేదికగా ఎంచుకున్నారు.

సాక్షి, సెంట్రల్‌ డెస్క్‌: ఒకప్పుడు ఆకాశమంత పందిరి.. పెళ్లికి నెల రోజుల ముందు నుంచే హడావుడి. పెళ్లి కుమార్తెతో పాటు పెళ్లి కుమారుడి ఇళ్లల్లో ఉరుకులు పరుగులు కనిపించేవి. ఇప్పుడు పెళ్లిళ్ల ట్రెండ్‌ మారింది. డెస్టినేషన్‌ వెడ్డింగ్స్‌కు ఆదరణ పెరుగుతోంది. సెలబ్రిటీలు చేసుకుంటున్నట్టుగా బాలి, మాల్దీవులు, రాజస్థాన్, కశ్మీర్‌ వంటి ప్రాంతాలకు వెళ్లడం లేదు. మన మధ్యే.. మన రాష్ట్రంలోనే ప్రకృతి అందాల మధ్య డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ జరుపుకోవడం నయా ట్రెండ్‌గా మారింది. 

సంప్రదాయబద్ధంగా.. ఆహ్లాదకర వాతావరణంలో వివాహాలు జరిపిస్తున్నారు. వధూవరుల తరఫు సమీప బంధువులతో పాటు అత్యంత ఆత్మీయుల సమక్షంలో పెళ్లిళ్లు జరిపిస్తున్నారు. వివాహానికి ముందు బ్యూటీ సెషన్లు, స్థానిక సంస్కృతిని తెలుసుకునే వర్క్‌షాప్‌లు వంటి వినూత్న కార్యక్రమాలు 2026లో ట్రెండ్‌గా ఉన్నాయి. సంపన్నులు, మధ్యతరగతి వారు సైతం డెస్టినేషన్‌ వెడ్డింగ్స్‌కే జై కొడుతున్నారు. 

వధువు తరఫున 40–50 మంది.. వరుడి తరఫున మరో 40–50 మందితో ప్రశాంతంగా పెళ్లి వేడుకను ముగిస్తున్నారు. ఆ తరువాత సొంతూళ్లలో బంధుమిత్రుల కోసం రిసెప్షన్లు ఏర్పాటు చేస్తున్నారు.చుట్టూ ప్రకృతి అందాలు.. సెలయేటి సవ్వళ్లు.. పక్షుల కిలకిలా రావాల మధ్య అడుగులో అడుగేస్తూ.. వధూవరుల ‘సప్తపది’ తంతు ఆహా.. అన్నట్టు ఉంటోంది. 

మొదటి రోజు: పెళ్లి సందడి 
రుషికొండ సమీపంలోని విలాసవంతమైన రిసార్ట్‌లో బంధువులందరికీ స్వాగతం పలికారు. సాయంత్రం సముద్రపు గాలుల మధ్య జరిగిన ’మెహందీ’ వేడుక కన్నుల పండువగా సాగింది.  

రెండవ రోజు: పసుపు సంబరం 
ఉదయాన్నే బీచ్‌ ఎదురుగా ఉన్న తోటలో ’హల్దీ’ వేడుక జరిగింది. పసుపు రంగు బట్టల్లో అతిథులందరూ ఒకరిపై ఒకరు పూల రెక్కలు, పసుపునీళ్లు చల్లుకుంటూ సందడి చేశారు. సాయంత్రం ‘సంగీత్‌’ వేడుకలో సముద్రపు అలల హోరు మధ్య డీజే పాటలకు అంజలి, రమేష్‌ కుటుంబ సభ్యులు నృత్యాలతో హోరెత్తించారు. 

మూడవ రోజు: కల్యాణ ఘట్టం 
తెల్లవారుజామున సముద్రపు ఒడ్డున మంటపం పచ్చని మామిడి ఆకులు, మల్లెపూల అలంకరణలతో దివ్యంగా ఉంది. బాలభానుడి కిరణాలు సముద్రాన్ని తాకుతున్న వేళ.. వేద మంత్రాల సాక్షిగా రమేష్‌ అంజలి మెడలో మూడుముళ్లు వేశాడు. హిందూ సంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ వివాహం ఆధునిక డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ శైలిలో అతిథులకు మర్చిపోలేని అనుభూతినిచి్చంది. ఇలా వీరేకాదు అత్యధికులు ఈ తరహా వివాహాల వైపు మొగ్గు చూపుతున్నారు. 

పర్యావరణ హితంగానూ.. 
ప్లాస్టిక్‌ రహిత అలంకరణలతో స్థానిక కళాకారులు, స్థానిక వంటకాలకు స్థానం కల్పిస్తూ పర్యావరణానికి హాని కలగకుండా వివాహాలు చేసుకోవడం కూడా కొత్త బాధ్యతాయుతమైన ట్రెండ్‌గా మారింది. 2026 నాటికి భారతదేశంలో డెస్టినేషన్‌ వెడ్డింగ్స్‌ మార్కెట్‌ విలువల 18 బిలియన్‌ డాలర్లుగా నమోదు కాగా.. 2033 నాటికి 55 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనా.

ఏపీలోనూ ఆదరణ 
మన రాష్ట్రంలోనూ డెస్టినేషన్‌ వెడ్డింగ్స్‌ పెరిగాయి. విశాలమైన తీర ప్రాంతాలు, కొండకోనల నడుమ రిసార్ట్‌లు ఇందుకు వే­ది­క అవుతున్నాయి. బెంగళూరు వంటి ప్రాంతాలకు చెందిన వా­రు సైతం విశాఖపట్నం, భీమిలి, చీరాల, బాపట్ల వంటి తీరాలతోపాటు దిండి, కోనసీమలోని రిసార్ట్స్, కొండ ప్రాంతాలు, చా­రిత్రక కట్టడాలను వివాహ వేదికలుగా మార్చుకుంటున్నారు.

దోహదం చేస్తున్న అంశాలివీ 
»  జెన్‌ జెడ్‌ అభిరుచులకు డెస్టినేషన్‌ వివాహాలు అద్దం పడుతున్నాయి.  
» విహార యాత్రలా మాత్రమే కాకుండా.. వధూవరుల కుటుంబాల మధ్య అనుబంధాలను మరింతగా పెనవేస్తాయని జెన్‌ జెడ్‌ భావిస్తోంది. 
»  డెస్టినేషన్‌ వెడ్డింగ్స్‌తో ఏర్పాట్ల కోసం పడే శ్రమ, ఖర్చులను కూడా పరిమితం చేయడంతో పాటు ఆహ్లాదకర వాతావరణంలో వివాహాలు జరిపించి మధురానుభూతి పొందుతున్నారు.  
» సముద్ర తీరాలు, చారిత్రక కట్టడాలు, కొండ ప్రాంతాల వంటి ప్రకృతి అందాల నడుమ పెళ్లి చేసుకోవడం వల్ల జీవితాంతం గుర్తుండిపోయే సినిమాటిక్‌ ఫొటోలు, వీడియోలు లభిస్తున్నాయి. 
» ఆదాయం పెరగడంతో చాలామంది డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ను సామాజిక హోదాకు గుర్తింపుగా భావిస్తున్నారు.

మధురానుభూతి 
గతంలో పెళ్లి అంటే ఎంతో హడావుడి ఉండేది. ఏర్పాట్ల కోసం కుటుంబ సభ్యు­లంతా హైరానా పడాల్సి వచ్చేది. అందుకే మా అబ్బాయి అమర్‌ శంకర్‌ వివాహం విశాఖలోని రిసార్ట్స్‌లో ప్లాన్‌ చేశాం. ఆత్మీయుల సమక్షంలో చేసిన పెళ్లి మధురానుభూతి ఇచ్చింది. వచ్చిన బంధువులంతా మినీ ట్రిప్‌లా ఎంజాయ్‌ చేశారు. మేము కూడా అతిథుల మాదిరిగా సరదాగా గడిపాం.  – యు.ఉషాదేవి, విజయనగరం

బడ్జెట్‌ ఫ్రెండ్లీగానే.. 
డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ కూడా బడ్జెట్‌ ఫ్రెండ్లీగానే చేసుకోవచ్చు. వధూవరుల అభిరుచి మేరకు అన్ని రకాల ఏర్పాట్లు ఎక్కడైనా సరే మేం చేస్తాం. స్టేజి ఎంపికపైనే ఖర్చు ఆధారపడి ఉంటుంది. ఆర్కెస్ట్రా వంటి సాంస్కృతిక కార్యక్రమాలను కూడా సమకూరుస్తున్నాం.  – టి.రవళి, తలశిల వెడ్డింగ్‌ ప్లానర్స్, విజయవాడ

అతిథుల్లా వస్తే చాలు 
వధూవరులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా అతిథుల్లా వస్తే చాలు. వివాహానికి సంబంధించిన అన్ని వస్తువులతో పాటు, నచ్చిన మెనూ, డెకరేషన్, ఫొటో, వీడియో గ్రఫీ, ఘట్టానికి తగ్గట్టు స్టేజి ఏర్పాట్లు చేస్తాం. ప్రస్తుతం అందరూ వివాహాన్ని గ్రాండ్‌గా చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. వారి అభిరుచికి తగ్గట్టు సరీ్వసు అందిస్తున్నాం.   – అభి, అభి ఈవెంట్స్‌ అండ్‌  ఫుడ్‌ కేటరర్స్, రాజమండ్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement