ఏయూలో రూ.10 కోట్లతో ఆధునిక ప్రయోగశాల
మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం రసాయన శాస్త్ర విభాగంలో అరోబిందో ఫార్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను గురువారం ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్ ప్రారంభించారు. ఈ కేంద్రంలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ విద్యార్థులకు ప్రాయోగిక శిక్షణ అందించేందుకు సుమారు రూ.10 కోట్ల వ్యయంతో హెచ్పీఎల్సీ, జీసీ, డీఎస్సీ వంటి ఆధునిక ఫార్మా పరికరాలను ఏర్పాటు చేశారు. విద్యార్థుల ఉపాధి నైపుణ్యాలను పెంపొందించడంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని వీసీ పేర్కొన్నారు. అరోబిందో ఫార్మా ఫౌండేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ యు.ఎన్.బి.రాజు మాట్లాడుతూ ఔషధ తయారీ రంగంలో క్వాలిటీ కంట్రోల్ విభాగం ఎంతో ముఖ్యమని తెలిపారు. ఏయూ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎం.వి.ఆర్.రాజు మాట్లాడుతూ శిక్షణ సిబ్బంది, పరికరాల నిర్వహణ బాధ్యతలను అరోబిందో ఫార్మానే చేపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో రసాయన శాస్త్ర విభాగాధిపతి ఆచార్య బి.వి.వి. శైలజతో పాటు పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ కేంద్రంలో అందించే ప్రాక్టికల్ శిక్షణ వల్ల ఎమ్మెస్సీ కెమిస్ట్రీ విద్యార్థులకు ఫార్మా కంపెనీల్లో, ముఖ్యంగా క్వాలిటీ కంట్రోల్ విభాగంలో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని నిర్వాహకులు తెలిపారు.


