‘సెల్లార్లలో వ్యాపారాలు చేస్తే కఠిన చర్యలు’
డాబాగార్డెన్స్: జీవీఎంసీ పరిధిలోని పలు జోన్లలో ఆపరేషన్ లంగ్స్ 3.0లో భాగంగా బుధ, గురువారాల్లో మొత్తం 11 ఆక్రమణలను తొలగించినట్లు మున్సిపల్ ముఖ్య పట్టణ ప్రణాళికాధికారి(సీసీపీ) ప్రభాకరరావు తెలిపారు. నగరంలోని సెల్లార్లు, స్టిల్ట్ ఫ్లోర్లలో పార్కింగ్కు కేటాయించిన స్థలాలను ఇతర అవసరాలకు వాడుతున్న వారిపై ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. 8వ వార్డు పరిధిలోని మిథిలాపురి కాలనీ వద్ద ఒక ఆక్రమణ, 14వ వార్డు సీతమ్మధార వద్ద ఒక గోడౌన్, 43వ వార్డు దొండపర్తి వద్ద మరో ఆక్రమణను తొలగించారు. 90వ వార్డు ఎన్ఏడీ జంక్షన్ వద్ద ఉన్న ఆక్రమణ, 15వ వార్డు ఇసుకతోట కృష్ణమందిర్ ఎదురుగా ఒకటి, 13వ వార్డు దారపాలెం వద్ద మరొక ఆక్రమణ, 67వ వార్డు మెయిన్ రోడ్డులోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వద్ద, సౌందర్య వద్ద రోడ్డుపై నిల్వ ఉంచిన స్టోరేజ్ మెటీరియల్ను తొలగించారు. 82వ వార్డు ఏపీఎన్ఆర్ కాంప్లెక్స్, ఎమ్మార్వో కార్యాలయ రోడ్డు వద్ద ఒక షాపును, పూడిమడక రోడ్డులో రెండు ఆక్రమణలను తొలగించినట్లు సీసీపీ ప్రభాకరరావు తెలిపారు. ఆక్రమణదారులు వెంటనే తమ షాపులను స్వచ్ఛందంగా తొలగించుకోవాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


