క్యాన్సర్ రహిత సమాజమే లక్ష్యం
ఏయూక్యాంపస్ : అసోసియేషన్ ఆఫ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్స్ ఆఫ్ ఇండియా గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా బీచ్రోడ్డులో క్యాన్సర్ అవగాహన వాక్ నిర్వహించారు. ‘50 ఏళ్లుగా స్వస్థత – క్యాన్సర్ రహిత రేప టి దిశగా’ అనే నినాదంతో కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ వరకు ఈ ర్యాలీ సాగింది. సుమారు 100 మంది రేడియేషన్ ఆంకాలజిస్టులు, మెడికల్ ఫిజిసిస్టులు, రేడియేషన్ టెక్నాలజిస్టులు ఇందులో పాల్గొని, రేడియేషన్ థెరపీపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ బి.రవి శంకర్ మాట్లాడుతూ.. క్యాన్సర్ను సకాలంలో గుర్తించడంపై అవగాహన పెంచడం తమ ఉద్దేశమని తెలిపారు. ఏఆర్వోఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సేనాపతి మాట్లాడుతూ.. దేశంలో ఆంకాలజీ ప్రమాణాలను మెరుగుపరచడంలో సంస్థ అందిస్తున్న 50 ఏళ్ల సేవలను గుర్తుచేసుకున్నారు. ఏపీ అధ్యక్షుడు ఎన్.సుజాత, కార్యదర్శి పీబీ ఆనంద రావు, సదస్సు కార్యదర్శి వి.దివ్య సౌజన్య తదితరులు పాల్గొన్నారు.


