పేదల ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం
కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్
మహారాణిపేట: జిల్లాలో పేదల గృహ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గృహ నిర్మాణ శాఖ ప్రగతిపై నియోజకవర్గాలు, లేఅవుట్ల వారీగా ఆయన సమీక్ష నిర్వహించారు. రాబోయే 3 నుంచి 4 నెలల కాలం గృహ నిర్మాణాలకు అత్యంత అనుకూలమైన సమయమని, ఈ లోపు పెండింగ్లో ఉన్న పనులన్నీ ముమ్మరంగా చేపట్టాలని కలెక్టర్ సూచించారు. నిర్మాణ పనుల్లో వెనుకబడి ఉన్న లేఅవుట్లలో పనులు వేగవంతం చేసేందుకు అదనంగా కూలీలను నియమించుకోవాలని ఆదేశించారు. గృహ నిర్మాణ లక్ష్యాలను సాధించడంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రగతి తక్కువగా ఉన్న అధికారులకు తక్షణమే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని హౌసింగ్ పీడీ సత్తిబాబును ఆదేశించారు. గృహాల పురోగతిని స్వయంగా పరిశీలించేందుకు తాను క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో భీమిలి ఆర్డీవో సంగీత్ మాధూర్, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, జోనల్ కమిషనర్లు, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.


