ఆర్థిక పరిస్థితులు సహకరించక, అథ్లెటిక్స్కే స్వస్తి చెప్పాలనుకున్న ఒక సాధారణ అమ్మాయి.. నేడు ప్రపంచ అత్యున్నత క్రీడా వేదిక ఒలింపిక్స్లో దేశానికి ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదిగితే.. అది ఒక సంచలనం. ఆ సంచలనాన్ని సుసాధ్యం చేసి చూపారు నగరానికి చెందిన పరుగుల రాణి జ్యోతి ఎర్రాజీ. హార్డిల్స్ రేసులో అడ్డంకులను దాటినట్టే, తన జీవితంలోని అడ్డంకులను అధిగమించి ఆమె గెలుపు తీరానికి చేరారు. తొలినాళ్లలో జ్యోతి సాధించిన జాతీయ రికార్డులు సాంకేతిక కారణాలతో నమోదు కాలేదు. అయినా ఆమె నిరుత్సాహపడలేదు. పట్టువదలని దీక్షతో శ్రమించి, తన సొంత రికార్డులను తానే మళ్లీ మళ్లీ తిరగరాస్తూ చరిత్ర సృష్టించారు. 100 మీటర్ల హార్డిల్స్ విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూ, అంతర్జాతీయ స్థాయిలో వరుస పతకాలను కొల్లగొట్టారు. తద్వారా మెరుగైన ర్యాంకింగ్ను సాధించి, ప్రతి అథ్లెట్ కల అయిన ఒలింపిక్స్కు అర్హత సాధించారు. ట్రాక్ పైన పరుగు తీసేటప్పుడు కేవలం కొన్ని సెకన్ల సమయాన్ని తగ్గించుకోవాలన్నా ఏళ్ల తరబడి కఠోర సాధన అవసరం. అలాంటిది, అడ్డంకులతో కూడిన హార్డిల్స్ రేసులో భారత్ నుంచి ‘ఫాస్టెస్ట్ వుమెన్ రన్నర్’గా నిలిచి జ్యోతి అబ్బురపరిచారు. భారతదేశం నుంచి అథ్లెటిక్స్లో ఒలింపిక్స్కు వెళ్లే అతికొద్ది మంది క్రీడాకారుల సరసన నిలిచి, విశాఖ ఖ్యాతిని ప్రపంచానికి చాటారు.


