తీరంలో హోరెత్తిన సైకిల్ ర్యాలీ
విశాఖ స్పోర్ట్స్: సాగరతీరంలో ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ 63వ ఎడిషన్ ఆదివారం ఉత్సాహభరితంగా సాగింది. ఆరోగ్యం, సామరస్యం, జాతీయ స్ఫూర్తి మేళవించి పిల్లల తల్లిదండ్రులతో పాటు సీనియర్ సిటిజన్లు కూడా పెడలింగ్ చేయడంతో ర్యాలీ సందడిగా మారింది. మూడు రోజుల పాటు జరిగే ఫిట్ ఇండియా కార్నివాల్–2026కు భారత క్రీడాప్రాధికార సంస్థ విశాఖను వేదికగా చేసుకుంది. ఆదివారం నుంచి మంగళవారం వరకు ఫిట్నెస్ వర్క్షాప్లు, సరదా పోటీలు, ప్రదర్శనలు, సామూహిక భాగస్వామ్య కార్యకలాపాలు జరగనున్నాయి. తొలి రోజు సైకిల్ ర్యాలీ ఆర్కే బీచ్లోని కాళీమాత అలయం వద్ద ప్రారంభమై వీఎంఆర్డీఏ పార్కు దరి వైఎస్సార్ విగ్రహం చెంత టర్న్ తీసుకుని తిరిగి ప్రారంభ స్థలికి చేరడంతో 5 కి.మీ. ర్యాలీ ముగిసింది. ఏపీ క్రీడాప్రాధికార సంస్థ చైర్మన్ రవినాయుడు, ప్రభుత్వ విప్ గణబాబు, భారత క్రీడాప్రాధికార సంస్థ సీనియర్ అధికారులు, సాయ్ సెంటర్ బెంగళూర్ ప్రాంతీయ సంచాలకుడు విష్ణు సుధాకరన్ తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒలింపియన్ జిన్సన్ జాన్సన్ ఆకర్షణగా నిలిచారు. జుంబా వార్మప్తో పాటు, రోప్ స్కిప్పింగ్, కుడో మార్షల్ ఆర్ట్స్, ఫ్లాగాఫ్తో సైక్లిస్ట్ల ప్రవాహం సుందర తీరాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చింది. డాక్టర్ ఫర్హా, సైక్లిస్ట్ చందన జయరామ్, కమ్యూనిటీ నాయకులను సత్కరించారు. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ, భారత క్రీడా ప్రాధికార సంస్థ, సైక్లింగ్ సమాఖ్య భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం జరుగుతోంది.


