ఉత్సాహంగా ఏపీఈపీడీసీఎల్
అంతర డివిజన్ల క్రీడాపోటీలు
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్) ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగుల అంతర డివిజన్ల క్రీడా పోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి. రైల్వే స్టేడియంలో రెండు రోజుల పాటు జరగనున్న ఈ పోటీలను సంస్థ సీఎండీ ఇమంది పృథ్వీతేజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. ఉద్యోగులు తరచూ క్రీడల్లో పాల్గొనడం వల్ల విధుల్లో మరింత చురుకుదనం వస్తుందని పేర్కొన్నారు. క్రీడలు కేవలం వినోదం కోసమే కాకుండా, ఉద్యోగుల్లో క్రమశిక్షణను, పోటీతత్వాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. అనంతరం ఆయన బ్యాడ్మింటన్ ఆడి ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపారు. సంస్థ ఆపరేషన్స్ డైరెక్టర్ టి.వి.సూర్యప్రకాష్ మాట్లాడుతూ.. క్రీడలు ఉద్యోగుల మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయన్నారు. కాగా.. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని డివిజన్ల నుంచి విద్యుత్ ఉద్యోగులు, క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. పురుషుల విభాగంలో కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, చదరంగం, క్యారమ్స్, మహిళల విభాగంలో తాడులాగుట, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, చదరంగం, క్యారమ్స్, మ్యూజికల్ చైర్స్, లెమన్ అండ్ స్పూన్ తదితర పోటీలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో సంస్థ ఉద్యోగులు, అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.


