ఎద్దులపై పెద్దపులి దాడి
మేడిపల్లి: భీమారం మండలం మోత్కురావుపేటతోపాటు చుట్టుపక్కల ప్రజలకు పెద్దపులి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఐదు రోజులుగా మోత్కురావుపేట పరిసరాల్లో సంచరిస్తూ.. మూగజీవలపై దాడి చేస్తోంది. శనివారం గ్రామానికి చెందిన ఎనుగుల గంగారాం మూడు ఎద్దులపై దాడికి పాల్పడింది. ఆ ప్రాంతంలో చాలా మూగజీవాలు ఉండడం.. అవి గట్టిగా అరవంతో పులి పారిపోయిన ఆనవాళ్లు ఉన్నాయని గంగారాం తెలిపారు. ఘటన స్థలాన్ని పశువైద్యులు వెన్నెల, శ్రీనివాస్ పరిశీలించి గాయపడిన మూగజీవాలకు చికిత్స అందించారు. అటవీశాఖ అధికారులు ఘటన స్థలాన్ని సందర్శించారు. పాదముద్రలు, ఎద్దులపై ఉన్న గాయాలు పరిశీలించి పెద్దపులిగా నిర్ధారించారు. కొడిమ్యాల ఎఫ్ఆర్వో మోయినొద్దీన్, మెట్పల్లి ఎఫ్ఆర్వో పద్మారావు, గోవిందారం ఎఫ్ఎస్వో సుబ్బారావు, బీట్ ఆఫీసర్లు ఫిరోజ్, రాజేశం, టైగర్ మానిటరింగ్ టీం సభ్యులు, రెవెన్యూ అధికారులు ఉన్నారు.


