ఎన్టీపీసీ సీఎండీ ఎంపిక కోసం ప్యానెల్‌ | - | Sakshi
Sakshi News home page

ఎన్టీపీసీ సీఎండీ ఎంపిక కోసం ప్యానెల్‌

Mar 5 2026 7:23 AM | Updated on Mar 5 2026 7:23 AM

జ్యోతినగర్‌(రామగుండం): ఎన్టీపీసీ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌(సీఎండీ) నియామకం కోసం కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ త్వరలోనే ఓ ప్యానెల్‌ను ఏర్పాటు చేయనుంది. పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సెలక్షన్‌ బోర్డు(పీఈఎస్‌బీ) ప్రతినిధి బృందం సభ్యులు సరైన అభ్యర్థిని గుర్తించడంలో విఫలమైనందున ప్రభుత్వ యాజమాన్యంలోని విద్యుత్‌ జనరేటర్‌.. ఎన్టీపీసీ సీఎండీని నియమించడానికి విద్యుత్‌ మంత్రిత్వ శాఖ ఒక సెర్చ్‌ కమ్‌ సెలక్షన్‌ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉన్నత నిర్వహణ పదవులకు అభ్యర్థులను నియమించే బాధ్యత కలిగిన సిబ్బంది, శిక్షణ శాఖ కింద ఉన్న పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సెలక్షన్‌ బోర్డు.. ఎన్టీపీసీ సీఎండీ పదవి కోసం డజను మంది అభ్యర్థులను ఇటీవల ఇంటర్వ్యూ చేసింది. ప్రస్తుతం సీఎండీగా కొనసాగుతున్న గురుదీప్‌సింగ్‌ ఈఏడాది జూలై 31వ తేదీన ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. కానీ సరైన అభ్యర్థి లేకపోవడంతో ఆయన సేవలను ఈ ఏడాది ఆగస్టు ఒకటో తేదీవరకు పొడిగించారు. ఈలోగా విద్యుత్‌ మంత్రిత్వ శాఖ ప్యానెల్‌ కమిటీ కొత్త సీఎండీని నియమించే దిశగా అడుగులు వేస్తుంది.

కుటుంబ కలహాలతో ఆత్మహత్య

కమాన్‌పూర్‌(మంథని): పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌ మండలం పేరపల్లి గ్రామానికి చెందిన చెప్పాల దేవేందర్‌(36) మంగళవారం రాత్రి క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి నర్సమ్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు.. దేవేందర్‌ 15ఏళ్లక్రితం అదే గ్రామానికి చెందిన మల్లేశ్వరిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు ఆశీష్‌, కుమార్తె కీర్తన సంతానం ఉన్నారు. భార్యాభర్తల మధ్య ఇటీవల విభేదాలు తలెత్తాయి. దీంతో భార్య తన ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లింది. ఈక్రమంలో మద్యానికి బానిసైన దేవేందర్‌.. మంగళవారం రాత్రి ఇంట్లో నుంచి వెళ్లి మంథని–పెద్దపల్లి ప్రధాన రహదారి పక్కన పత్తి చేనులో క్రిమిసంహారక మంది తాగి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్నామని ఎస్సై ప్రసాద్‌ తెలిపారు.

ఇసుక ట్రాక్టర్‌ సీజ్‌

కరీంనగర్‌రూరల్‌: సుల్తానాబాద్‌ మండలం గొల్లపల్లికి చెందిన దాసరి సంపత్‌ మానేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను బుధవారం బొమ్మకల్‌ ఫ్‌లైఓవర్‌ బ్రిడ్జి వద్ద పట్టుకుని సీజ్‌ చేసినట్లు సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు వివరించారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement