కరీంనగర్ కార్పొరేషన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నగరాన్ని అభివృద్ధి చేస్తామని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని శుక్రవారం నగరంలోని చంద్రపురికాలనీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజలు, పాలకవర్గ సభ్యుల సహకారంతో విజయంతం చేస్తామన్నారు. వేసవిలో తాగునీటికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఇప్పటికే సమ్మర్యాక్షన్ప్లాన్ రూపొందించామన్నారు. అమృత్ 2 పథకం ద్వారా రూ.147 కోట్లతో విలీన గ్రామాల డివిజన్ల లో పైప్లైన్ పనులు కొనసాగుతున్నాయని, అవసరమైన చోట రిజర్వాయర్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. డివిజన్ల పరిసరాలను, ఖాళీ స్థలాలను శుభ్రం చేయడంతో పాటు, డ్రైనేజీలోల సిల్టు తొలగించడం, శిధిలావస్థలో ఉన్న డ్రైనేజీ లను మరమ్మతులు చేయడం, అవసరమైన చోట కొత్త డ్రైనేజీ, రోడ్లు నిర్మిస్తామని తెలిపారు. నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ మాట్లాడుతూ 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక యాక్షన్ ప్లాన్ తయారు చేసి, అన్ని డివిజన్లను శుభ్రపరుస్తూ, సమస్యలు పరిష్కరిస్తామన్నారు.
సిల్ట్ తీశారు.. పనులు ప్రారంభించారు
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మొదటిరోజు మేయర్,అధికారులు చంద్రపురికాలనీలో డ్రైనేజీల్లో సిల్ట్, పరిసరాల్లోని చెత్తాచెదారాన్ని తొలగించారు. రూ.10 లక్షలతో డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేశం, ఆర్డీఎంఏ షాహిద్ మసూద్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, సహాయ కమిషనర్ దిలీప్ కుమార్, కార్పొరేటర్లు సాదినేని లావణ్య, బారి అపర్ణ పాల్గొన్నారు.


