కుట్ర కేసు!
రాజద్రోహం కేసులో మావోయిస్టు అగ్రనేతలు ఒకే ఎఫ్ఐఆర్లో గణపతి నుంచి మల్లా రాజిరెడ్డి వరకు తుపాకీ తూటాలతో రాజ్యాన్ని కూలదోసే ప్రణాళిక ప్రజాప్రతినిధులు, పోలీసుల హత్యలకు ప్రత్యేక టీంలు మాధవరెడ్డి, ఉమేశ్ చంద్ర, పరదేశీ నాయుడులను చంపింది ఆ టీంలే శ్రీపాదరావు హత్య కేసులో బెంగళూరులో చిక్కిన మల్లా రాజిరెడ్డి ఆయన స్టేట్మెంట్తో కరీంనగర్లో దేశద్రోహం కేసు ఇప్పటికే చార్జిషీట్ దాఖలు చేసిన పోలీసులు..కొనసాగుతున్న విచారణ
తెరపైకి మావోల
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
ఆపరేషన్ కగార్తో దేశంలో మావోయిస్టు ఉద్యమం దాదాపుగా ముగిసింది. మావోయిస్టు అగ్రనేత, మాస్టర్మైండ్ ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి మినహా పార్టీ కీలక నేతలంతా డీజీపీ శివధర్రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఒకప్పుడు తుపాకీ తూటాతోనే సమసమాజం వస్తుందని, దాడులతో ప్రభుత్వాన్ని కూలదోయవచ్చన్న ఆలోచనతో దేశవ్యాప్తంగా అనేకమంది ప్రజాప్రతినిధులను, పోలీసులను గెరిల్లా దాడులతో మట్టుబెట్టిన మావోయిస్టు పార్టీ అగ్రనేతలపై 2008లో కరీంనగర్లో రాజద్రోహం కేసు నమోదైంది. మాజీ స్పీకర్ శ్రీపాదరావు హత్య కేసు దర్యాప్తులో భాగంగా మల్లా రాజిరెడ్డిని పట్టుకున్న పోలీసులకు దేశవ్యాప్తంగా ఆ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న అనేక దాడులకు సంబంధించిన కుట్ర విధానం తెలిసింది. దీంతో కరీంనగర్ పోలీసులు మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతితో సహా 32 మందిపై రాజద్రోహం కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ– 28గా ఉన్న అమిత్బక్షీకి తాజాగా బెయిల్ రావడంతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
నేరాంగీకార పత్రంలో ఏముంది?
మల్లా రాజిరెడ్డి కరీంనగర్ పోలీసులకు ఇచ్చిన నేరాంగీకార పత్రంలో తాము తుపాకీ తూటాలతో హింసామార్గంలో రాజాన్ని ఎలా కూలదోయాలనుకుంటున్న విషయాన్ని వెల్లడించాడు. ఆ సమయంలో మల్లా రాజిరెడ్డి మావోయిస్టు పార్టీలో సెంట్రల్ కమిటీ సభ్యుడు, పొలిట్బ్యూరో మెంబర్తోపాటు దేశంలోని నైరుతీ ప్రాంతానికి (మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్)లకు కార్యదర్శిగా ఉన్నాడు. అందులో భాగంగానే తాము అప్పటి మాజీమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి, మాజీస్పీకర్ శ్రీపాదరావు, ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి, ఐపీఎస్ ఆఫీసర్లు ఉమేశ్ చంద్ర, పరదేశీ నాయుడులను కాల్చిచంపినట్లు తెలిపాడు. అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, మంత్రి రాజ్యలక్ష్మీ కాన్వాయ్లపై దాడులు అందులో భాగమేనని వివరించాడు. ఉమ్మడి ఏపీ, మహారాష్ట్ర, చత్తీస్ఘడ్, ఒడిశాలలోని పోలీసుస్టేషన్లపై దాడులు చేసి వందలాది ఆయుధాలు తస్కరించిన విధానాన్ని పేర్కొన్నాడు.
అప్పట్లో పోలీసులు సెక్షన్ 120, 121, 121 (ఏ) ఐపీసీలతోపాటు 25, 27, 35 ఆర్మ్స్ యాక్ట్, ఎక్స్ప్లోజివ్ సబ్స్టాన్సెస్ యాక్ట్ సెక్షన్ 3, 5 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో ముప్పాల లక్ష్మణ్ రావు, మల్లోజుల కోటేశ్వర్ రావు, ప్రమోద్ మిశ్రా, కటకం సుదర్శన్, అక్కిరాజు హరగోపాల్, చెరుకూరి రాజ్కుమార్, నంబాల కేశవరావు, మల్లోజుల వేణుగోపాల్, కోబాడ్ గాంధీ, ప్రశాంత్ బోస్, రాజేష్, జనార్ధన్, తిప్పిరి తిరుపతి, చంద్రయ్య యాదవ్, రంజిత్ బోస్, సుమిత్, గజానంద్, లంక పాపి రెడ్డి, జినుగు నర్సింహరెడ్డి, జంతు ముఖర్జీ, జస్పాల్ సింగ్, వారణాసి సుబ్రహ్మణ్యం, రోహిత్, ఆశుతోష్ కుమార్ సింగ్, భాస్కర్, కృష్ణన్ శ్రీనివాస్, సుమనంద్ సింగ్, కుప్పు దేవరాజు, మోహన్, అఖిలేష్ జాదవ్, దేవ్ కుమార్ సింగ్, జనార్దన్ను నిందితులుగా పేర్కొన్నారు.


