కోరుట్లరూరల్: మండలంలోని పైడిమడుగు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. 2024–25కు గాను నేషనల్ ఫెడరేషన్ కో–ఆపరేటివ్ బ్యాంకు ఆధ్వర్యంలో నేషనల్ బ్యాంకు ఆఫ్ అగ్రికల్చర్ ఆండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డు) సిఫారసుతో నిర్వహించిన సర్వేలో పైడిమడుగు పీఏసీఎస్ జాతీయస్థాయిలో మూడోస్థానంలో నిలిచి అవార్డు దక్కించుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పనితీరు, ఆర్థిక లావాదేవీల నిర్వహణలో పారదర్శకత, రైతులకు అందించిన రుణాలు, ఇతర సేవలను పరిశీలించగా పైడిమడుగు పీఏసీఎస్కు మూడో బహుమతి దక్కింది. ఈనెల 17న సిక్కింలో నిర్వహించే కార్యక్రమంలో అవార్డును ప్రదానం చేయనున్నారని పీఏసీఎస్ సీఈఓ శ్యామ్సుందర్ తెలిపారు. అవార్డు రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. పాలక వర్గం, సిబ్బంది, రైతుల సమష్టి సహకారంతోనే అవార్డు సాధ్యమైందన్నారు.
ఆర్థిక లావాదేవీలు, రైతు సేవలో దేశంలో మూడోస్థానం


