కేంద్రప్రభుత్వం
అన్ని ఏర్పాట్లు చేసింది
ఢిల్లీలో 24/7 కంట్రోల్ రూం
ఫోన్ నంబర్లు
అక్కడ యుద్ధం..
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న భారతీయులకు కేంద్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది. అవసరమైతే ప్రత్యేక విమానాల ద్వారా స్వదేశానికి రప్పించే చర్యలు తీసుకుంటామని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ స్పష్టం చేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు కార్మికులు, టెక్నీషియన్లు, నర్సులు పశ్చిమాసియా దేశాల్లో పనిచేస్తుండగా, అక్కడి యుద్ధ వాతావరణం కారణంగా వారి కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికుల కుటుంబ సభ్యులు ప్రతీరోజు ఫోన్ కాల్స్ ద్వారా పరిస్థితిని తెలుసుకుంటున్నారు.
వివిధ రంగాల్లో ఉమ్మడి జిల్లావాసులు
ఇజ్రాయెల్– ఇరాన్ సరిహద్దు ఉద్రిక్తతలు, అలాగే కొన్ని గల్ఫ్ దేశాల్లో భద్రతా హెచ్చరికలు జారీ కావడంతో అక్కడి పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఉమ్మడి జిల్లా నుంచి వెళ్లిన కొందరు యువకులు నిర్మాణ రంగంలో, మరికొందరు ఆసుపత్రుల్లో, వివిధ కంపెనీలతో పాటు గృహాల్లో సేవలందిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఎవరికీ ప్రాణాపాయం లేదని, అందరూ సురక్షితంగానే ఉన్నారని కుటుంబ సభ్యులకు సమాచారం అందినట్లు తెలిసింది.
ఏఐ వీడియోలపై అప్రమత్తత
సోషల్ మీడియాలో యుద్ధానికి సంబంధించిన పేరుతో కొన్ని ఏఐ రూపొందించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఏఐ వీడియోలను చూసి గల్ఫ్దేశాల్లో ఉండే కార్మికుల, ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని కంటిమీద కునుకులేకుండా గడుపుతున్నారు. అయితే ఏఐ వీడియోలను నమ్మి భయపడవద్దని అధికారులు సూచిస్తున్నారు. అధికారిక సమాచారం కోసం భారత రాయబార కార్యాలయాలు, విదేశాంగ శాఖ విడుదల చేసే ప్రకటనలనే అనుసరించాలని సూచించారు. కాగా గల్ఫ్లో ఉన్న వారు సైతం సోషల్ వదంతులు నమ్మవద్దని తాము క్షేమంగానే ఉన్నామంటూ వీడియోలు పోస్టుచేస్తుండడం కుటుంబ సభ్యులకు కొంత ఉపశమనం కలుగుతుంది.
తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం
పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ సీనియర్ అధికారులు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు సంబంధిత భారత రాయబార కార్యాలయాలతో ఇప్పటికే నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పరిస్థితులను అంచనా వేస్తున్నారు. అవసరమైన సమన్వయం, సహాయం అందించేందుకు ఈ కంట్రోల్ రూమ్ పనిచేస్తుంది.
అమెరికా–ఇజ్రాయిల్–ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులను ఇండియాకు రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దుబాయి, ఖతార్, బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియాలో నివసిస్తున్న వారు రోడ్డు మార్గం ద్వారా మస్కట్ చేరి అక్కడి నుంచి భారత్కు తిరిగి రావచ్చు. ఒమన్ ప్రవేశానికి ముందస్తు విజిట్/ఈ–వీసా తప్పనిసరి. అమెరికా, యూకే, కెనడా, జపాన్ లేదా షెంగెన్ వీసా ఉన్నవారికి ఆన్–అరైవల్ వీసా సదుపాయం ఉంది. పాస్పోర్ట్ కనీసం ఆరునెలలు చెల్లుబాటు కావాలి. సమాచారం కోసం మస్కట్లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలి. – బండి సంజయ్కుమార్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి
వందన బరువా: +91 9871999044, సీహెచ్ చక్రవర్తి: +91 9958322143
జావేద్ హుస్సేన్: +91 9910014749, రక్షిత్ నాయక్: +91 9643723157


