అందుబాటులోకి ట్రాఫిక్ గ్రీవెన్స్ సెల్
కరీంనగర్క్రైం: కరీంనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన రిసెప్షన్, గ్రీవెన్స్ సెల్ను సీపీ గౌస్ ఆలం బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగాచసీపీ మాట్లాడుతూ.. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని, ప్రజలు తమ ఫిర్యాదులను నేరుగా విన్నవించుకునేందుకు గ్రీవెన్స్ సెల్ దోహదపడుతుందని పేర్కొన్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలు, వేధింపులు లేదా ఇతర ఇబ్బందులపై నేరుగా ఫిర్యాదు చేయవచ్చన్నారు. నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రజలు సలహాలను, సూచనలు అందించవచ్చన్నారు. బాధితుల నుండి వచ్చే ప్రతి ఫిర్యాదును రికార్డు చేసి, నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చలాన్ల వివరాలు, రోడ్డు భద్రతా నియమాల సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. అడిషనల్ డీసీపీ వెంకటరమణ, భీంరావు, ట్రాఫిక్ ఏసీపీ యాదగిరిస్వామి, సీఐ కరీముల్లాఖాన్ పాల్గొన్నారు.


