కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): మహాత్మాగాంధీ స్ఫూర్తితో మద్యం విక్రయాలపై మొట్లపల్లి గ్రామస్తులు నిషేధం విధించారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం మొట్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్, పాలకవర్గం ఈమేరకు నిర్ణయం తీసుకుంది. తొలుత బెల్ట్షాపులు నిర్వహించవద్దని సర్పంచ్ తులా మనోహర్రావు అధ్యక్షతన ఈనెల ఒకటో తేదీన పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటైన సమావేశంలో పాలకవర్టం నిర్ణయించింది. గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. మద్యం మత్తులో అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతూ, చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని, అరాచకాలు, ఘర్షణలకు దారితీస్తోందని, పలు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని సమావేశం అభిప్రాయపడింది. ముఖ్యంగా కాలేయం, ఊపిరితిత్తులు చెడిపోయి అనారోగ్యంతో ఆస్పత్రుల పాలవుతున్నారని, ఆర్థికంగా చితికిపోతున్నారని పేర్కొంది.


