ధర్మపురి: శ్రీలక్ష్మీనృసింహస్వామి బ్రహ్మపుష్కరిణి బ్రహ్మోత్సవాల శోభ సంతరించుకుంది. స్వామివారి తెప్పోత్సవం, డోలోత్సవం కార్యక్రమాలను మూడురోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం కోనేరును ఫైరింజన్ సాయంతో శుభ్రం చేసి ఉత్సవాలకు సిద్ధం చేశారు. చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ఉదయం 6 నుంచి 7గంటల వరకు మాత్రమే డోలోత్సవం నిర్వహిస్తారు. అనంతరం ఆలయాలను మూసివేస్తారు. 4న సాయంత్రం 5 గంటల నుంచి ఉగ్ర నృసింహస్వామికి, 5న శ్రీవేంకటేశ్వరస్వామికి తెప్పొత్సవం, డోలోత్సవం నిర్వహిస్తారు. తెప్పోత్సవం సందర్భంగా బ్రహ్మపుష్కరిణిలో స్వామివారిని హంస వాహనంపై ఊరేగిస్తారు. డోలోత్సవంలో భాగంగా స్వామివారిని బోయలతో కోనేరు మధ్యలో ఉన్న భోగమండపంలోకి తీసుకెళ్లి ఊయలపై ఆశీనుల చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.


