టవర్ ఏర్పాటు వివాదాస్పదం
● వద్దన్నందుకు గ్రామస్తులపై ఫిర్యాదు
● ఠాణా మెట్లెక్కిన మహిళలు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఇళ్ల సమీపంలో టవర్ ఏర్పాటు చేయొద్దన్నందుకు ఎయిర్టెల్ సంస్థ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు పోలీసులు గ్రామస్తులను శుక్రవారం ఠాణాకు పిలిపించడంతో వివాదాస్పదంగా మారింది. గ్రామస్తులు మాట్లాడుతూ మండలంలోని అల్మాస్పూర్లో కొత్తగా ఎయిర్టెల్ టవర్ నిర్మాణం చేపడుతున్నారని తెలిపారు. ఇళ్ల మధ్యలోనే టవర్ ఏర్పాటు చేస్తుండడంతో దాని ప్రభావంతో వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వద్దన్నారు. దీంతో ఆ సంస్థ నిర్వాహకులు టవర్ ఏర్పాటును అడ్డుకుంటున్నారని గ్రామస్తులపై పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. దీంతో గ్రామస్తులం ఠాణాకు వచ్చినట్లు చెప్పారు. ఈ సంఘటనపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నారు. విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని ఎస్సై రాహుల్రెడ్డి తెలిపారు.


