ధర్మపురి: కుటుంబ పోషణలో భర్తకు దీటుగా పని చేస్తూ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తున్న పలువురు మహిళలు మహారాణులుగా ఎదుగుతున్నారు. స్వయంకృషితో పలువురికి ఉపాధి కల్పిస్తున్నారు. ధర్మపురికి చెందిన కొల్లూరి లక్ష్మి, వీరబాబు దంపతులు చిన్నపాటి పూజాసామగ్రి దుకాణంతో కుటుంబాన్ని నడిపించారు. వీరికి కూతురు, కొడుకు బీటెక్, డిగ్రీ చదువుతున్నారు. ఖర్చులు పెరగడంతో ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయి. ఈనేపథ్యంలో లక్ష్మి ఆలోచనతో పట్టణంలోని గోదావరి ఒడ్డున అగరుబత్తీలు తయారు చేసే కుటీర పరిశ్రమను ప్రారంభించారు. ఇందుకు మహిళా సంఘం నుంచి రూ.2లక్షలు రుణం తీసుకున్నారు. పిల్లలు తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటూనే చదువుకుంటున్నారు. రోజూ 2రకాలైన 10 కిలోల అగరుబత్తీలు తయారు చేసి దుకాణాల్లో విక్రయిస్తా రు. అగర్బత్తీల తయారీకి ఆలయంలో వాడిన పూలను తీసుకొచ్చి ఎండబెట్టి వాటి పౌడర్ను వినియోగిస్తారు. ప్రస్తుతం రెండు చిన్నపాటి మిషన్లతోపాటు ఒక పిండి గిర్నీ నడిపిస్తున్నారు. కుటుంబమంతా పని చేస్తూ రోజూ రూ.వెయ్యి వరకు సంపాదిస్తున్నారు.


