డిజిటల్ క్రాప్ సర్వేకు సిద్ధం
కరీంనగర్ జిల్లాలో గ్రామాలు: 318
రెవెన్యూ గ్రామాలు: 210
సాగు విస్తీర్ణం: 3.37లక్షల ఎకరాలు
సర్వే నంబర్లు: 351545
మొత్తం రైతులు: 210904
వలంటీర్లు: 210
కరీంనగర్ అర్బన్: డిజిటల్ క్రాప్ బుకింగ్కు వ్యవసాయశాఖ సన్నద్ధమవుతోంది. నేడో, రేపో క్షేత్రస్థాయిలో పంటల బుకింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. పంటల వివరాలను నమోదు చేసేందుకు వలంటీర్లను నియమించారు. జిల్లావ్యాప్తంగా 210 రెవెన్యూ గ్రామాలుండగా సదరు సంఖ్య క్రమంలో నియామకం చేపట్టారు. పంటల వివరాలు పక్కాగా ఉండేలా శాటిలైట్ మ్యాపింగ్ ఆధారంగా డిజిటల్ సర్వే చేపట్టనున్నారు. గతంలో ఏఈవోల ద్వారా సర్వే నిర్వహించగా రైతులు, సర్వే నంబర్లవారీగా సర్వే చేయడానికి ఇప్పుడున్న ఏఈవోలతో అసాధ్యం. దీంతో సర్వేను వేగంగా పూర్తి చేసేందుకు వలంటీర్ల నియామకాన్ని చేపట్టారు. ఇటీవల వీరందరికి శిక్షణ ఇవ్వగా క్షేత్రస్థాయిలో పంటల ఫొటోలు తీసి డిజిటల్ పద్ధతిలో నమోదు చేస్తారు.
నిరుద్యోగ యువతకు ఉపాధి
తాత్కాలిక వలంటీర్లుగా గ్రామాల్లోని నిరుద్యోగ యువతకు అవకాశాన్ని కల్పించారు. అండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ కలిగి ఉండి, పదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన వారికి అవకాశం కల్పించారు. గ్రామంలోని భూములు, సాంకేతికతపై అవగాహన గల వారికి, వ్యవసాయ డిప్లొమో చేసిన అభ్యర్థులకు ప్రాధాన్యం కల్పించారు. ఒక్క ఫొటోకు రూ.7 చొప్పున పారితోషికాన్ని అందించనుండగా ప్రతీ రెవెన్యూ గ్రామానికి ఒక వలంటీర్ను నియమించారు. వ్యవసాయక్షేత్రాలకు వెళ్లి పంటల ఫొటోలు తీసి ప్రభుత్వ యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, దీనివల్ల ప్రభుత్వానికి పంట దిగుబడిపై కచ్చితమైన అంచనా రావడమే కాకుండా రైతులకు సకాలంలో పథకాలు అందనున్నాయి. 45 రోజుల్లో డిజిటల్ క్రాప్ సర్వే పూర్తి చేయాల్సి ఉంటుంది. రైతుల కమతాల వద్దకు వెళ్లి సర్వే నంబర్, రైతుల వారీగా పంట ఫొటో తీసి వివరాలు నమోదు చేయనున్నారు.
లక్షల్లో సర్వే నంబర్లు.. 210 వలంటీర్లు
కరీంనగర్ జిల్లాలో ప్రధానంగా వరి, పత్తి అత్యధిక విస్తీర్ణంలో సాగవుతోంది. మొక్కజొన్న, ఆరుతడి పంటలు తక్కువ విస్తీర్ణంలో సాగవడం పరిపాటి. ఈ క్రమంలో జిల్లాలో 318 గ్రామాలుండగా 3.51లక్షల సర్వే నంబర్లు ఉండగా వాటన్నింటిని యాప్లో నమోదు చేయనున్నారు. శాటిలైట్ మ్యాపింగ్ ప్రక్రియ గతంలోనే పూర్తవగా డిజిటల్ పద్ధతిలో పంటలను నమోదు చేస్తారు. శాటిలైట్ మ్యాపింగ్ లేని గ్రామాల్లో వ్యవసాయ విస్తరణాధికారులు పంటలు నమోదు చేస్తారు. యాసంగిలో సాగు చేసిన పంటలను వేగంగా డిజిటల్ సర్వే చేసేందుకు వలంటీర్ల నియామకాన్ని చేపట్టామని జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి వివరించారు. వీలైనంత త్వరగా సర్వే ప్రారంభిస్తామని చెబుతున్నారు.
208 మంది వలంటీర్ల నియామకం
రెవెన్యూ గ్రామాల వారీగా నియామకం
45 రోజుల్లో ప్రక్రియ పూర్తి


