గర్భిణికి పునర్జన్మ.. చిన్నారికి ఊపిరి
కరీంనగర్: జన్యుపరమైన గుండెజబ్బు, తీవ్రమైన పల్మనరీ హైపర్టెన్షన్తో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ మహిళకు హైదరాబాద్ మలక్పేట యశోద హాస్పిటల్ వైద్యులు సురక్షితంగా పురుడు పోశారు. కరీంనగర్లో శనివారం యశోద హాస్పిటల్ నియోనాటాలజిస్ట్ డాక్టర్ సత్యప్రియసాహూ, గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రియాన్షి మాట్లాడుతూ కరీంనగర్కు చెందిన 21 ఏళ్ల గర్భిణి తీవ్రమైన పల్మనరీ ఆర్టీరియల్ హైపర్టెన్షన్ (పీఏహెచ్), రైట్ వెంట్రిక్యులర్ డిస్ఫంక్షన్తో ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. గతంలో ఆమెకు వీఎస్డీ శస్త్రచికిత్స జరిగిన నేపథ్యం ఉండటంతో, గర్భధారణ సమయంలో కుడి గుండె వైఫల్యం చెంది ప్రాణాపాయం కలిగే ముప్పు పొంచి ఉందన్నారు. వైద్య నిపుణుల బృందం అత్యంత జాగ్రత్తగా పర్యవేక్షించి, 29 వారాల సమయంలోనే అత్యవసర సిజేరియన్ (ఎల్ఎస్సీఎస్) నిర్వహించినట్లు పేర్కొన్నారు. కేవలం 1.1 కిలోల బరువుతో జన్మించిన ఆడ శిశువుకు శ్వాసకోశ ఇబ్బందులు (ఆర్డీఎస్), సెప్సిస్ వంటి సమస్యలు తలెత్తాయన్నారు. వెంటనే చిన్నారిని అధునాతన ఎన్ఐసీయూలో ఉంచి ‘ఇన్సూర్’ పద్ధతిలో చికిత్స అందించామన్నారు. శిశువు గుండెలో ఉన్న రంధ్రాన్ని (పీడీఏ) డివైస్ క్లోజర్ ద్వారా విజయవంతంగా మూసివేసినట్లు తెలిపారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా కోలుకోవడంతో వారిని డిశ్చార్జ్ చేసినట్లు చేప్పారు. తీవ్రమైన గుండె జబ్బు ఉన్న మహిళల్లో ప్రసవం అత్యంత క్లిష్టమైనదని, మల్టీడిసిప్లినరీ వైద్య బృంద సమన్వయంతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. హై–రిస్క్ కేసులను ఎదుర్కోవడంలో యశోద ఆసుపత్రిలోని అత్యాధునిక వసతులు కీలక పాత్ర పోషించాయని వివరించారు. ఈ సమావేశంలో యూనిట్ హెడ్ కె.శ్రీనివాసరెడ్డి, ఏవీపీ శ్రీనివాస్ చిదుర పాల్గొన్నారు.
యశోదలో గుండెజబ్బు మహిళకు సురక్షిత ప్రసవం


