కరీంనగర్ అర్బన్: ఈనెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజులపాటు జిల్లాలో చేపట్టనున్న ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ చిత్రామిశ్రా వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. కార్యక్రమ నిర్వహణకు జిల్లాలో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై గురువారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. ఐదు దశల్లో 99 రోజులపాటు ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమ నిర్వహణకు వివిధ శాఖల అధికారులు సంసిద్ధం కావాలన్నారు. శాఖలవారీగా ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు ప్రణాళిక సిద్ధం చేయాలని అన్నారు. ఏప్రిల్ 2న గ్రామస్థాయిలో గ్రామసభలు నిర్వహించాలని తెలిపారు. ఏప్రిల్ 16న మండలస్థాయి, మే 2న నియోజకవర్గస్థాయి, మే 22న జిల్లాస్థాయిలో కార్యక్రమాలుంటాయన్నారు. ఈ సభల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేకూరుస్తున్న లబ్ధి, వివిధ పథకాలపై వివరించాలని తెలిపారు. శాఖలవారీగా 10 వారాలపాటు అమలు చేసే ప్రత్యేక కార్యాచరణను పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రణాళిక శాఖ నోడల్గా వ్యవహరిస్తుందని తెలిపారు. అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మికిరణ్, ఆర్డీవో మహేశ్వర్, ముఖ్య ప్రణాళిక అధికారి రాందత్తారెడ్డి, జెడ్పీ సీఈవో శ్రీనివాస్, ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


