యైటింక్లయిన్కాలనీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను సద్వినియోగం చేసుకోవడంతో పాటు డిజిటల్ చెల్లింపులపై రామగుండం కార్పొరేషన్ యైటింక్లయిన్కాలనీ అల్లూరు గ్రామానికి చెందిన చిరు కిరాణా వ్యాపారి బాలసాని నిర్మల శ్రద్ధపెట్టారు. నగదు రహిత లావాదేవీలు నిర్వహించి, అత్యధికంగా రూ.5,340 క్యాష్ బ్యాక్ పొంది ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె దృఢసంకల్పానికి అబ్బురపడిన కేంద్ర ప్రభుత్వం 2026 జనవరి 26 గణతంత్ర వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పించింది. నిర్మల తన భర్త బాలసాని రవికుమార్ గౌడ్తో కలిసి ఢిల్లీలోని గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిశారు. రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ అరుణశ్రీ చేతుల మీదుగా సత్కారం పొందారు.
స్వనిధి రుణంతో నవచైతన్యం
నిర్మల నవ చైతన్యం–2020లో సీఎం స్వనిధి పథకంలో తొలి విడతగా రూ.10వేలు రుణం పొంది ఇంట్లో కిరాణం ప్రారంభించారు. క్రమం తప్పకుండా రుణ వాయిదాలు డిజిటల్ రూపంలో చెల్లించడంతో ప్రభుత్వం రెండో విడతగా రూ.20 వేలు మంజూరు చేసింది. ఆ మొత్తంతో కిరాణంతో పాటు చీరల వ్యాపారం, కుట్టు మిషన్, మగ్గంవర్క్ ప్రారంభించి సక్సెస్ అయ్యారు. మూడోవిడత రూ.50వేలు రుణం పొంది ఆదర్శంగా నిలిచారు.


