సాక్షి, హైదరాబాద్: అత్యవసర సేవ అయిన డయల్–100 ఫిర్యాదును పట్టించుకోకుండా విధుల్లో నిర్లక్ష్యం వహించిన రాయదుర్గం పోలీస్స్టేషన్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ సయ్యద్ యూనస్ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం.రమేష్ ఆదివారం సస్పెండ్ చేశారు. శనివారం అర్ధరాత్రి గచ్చిబౌలిలోని ఐకియా సమీపంలో జరిగిన రెండు కార్లు ఢీకొన్న ఘటనలో బాధితుడు డయల్–100కు రెండుసార్లు ఫోన్ చేసి పోలీసుల సహాయం కోరాడు.
ఇన్చార్జిగా ఉన్న సయ్యద్ యూనస్ ఘటనా స్థలానికి వెళ్లకుండా ‘ఫోన్ చేసిన వ్యక్తి వల్లే ఇబ్బంది’ అంటూ నమోదు చేసి రెండు ఫిర్యాదులను మూసివేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో సయ్యద్ యూనస్ను సైబరాబాద్ సీపీ సస్పెండ్ చేశారు. శాఖాపరమైన విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని సీపీ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


