ఇరాన్‌ జెండాలతో వైట్‌హౌజ్‌ ఆవరణలో ప్రదర్శనలు | Hands off Iran Protests All Over USA Major Cities Full Details Here | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ జెండాలతో వైట్‌హౌజ్‌ ఆవరణలో ప్రదర్శనలు

Jun 23 2025 11:14 AM | Updated on Jun 23 2025 12:14 PM

Hands off Iran Protests All Over USA Major Cities Full Details Here

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ ఉద్రిక్తతల నడుమ.. అమెరికా రణరంగంలోకి దిగడంతో పశ్చిమాసియా ఒక్కసారిగా భగ్గుమంది. ఈ ఉద్రిక్తతల వేళ.. అమెరికా ప్రధాన నగరాల్లో ఇరాన్‌ మద్దతు ప్రదర్శనలు జరుగుతుండడం తీవ​ చర్చనీయాంశంగా మారింది. ఏకంగా అమెరికా అధ్యక్ష భవనం ఆవరణలోనే ట్రంప్‌ వ్యతిరేక నినాదాలతో ఓ ప్రదర్శన జరగడం గమనార్హం. 

ఇరాన్‌పై యుద్ధం వద్దు.. ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వడం ఆపండి.. గాజాలో నరమేధం ఆగిపోవాల్సిందే అంటూ అధ్యక్షుడు ట్రంప్‌ను ఉద్దేశించి పలువురు నినాదాలు చేశారు. మరికొందరు ఇరాన్‌కు మద్దతుగా పాటలు పాడుతూ తమ నిరసన గళం విప్పారు. ప్రస్తుతం యుద్ధ వ్యతిరేకత నినాదాలతో అమెరికా ప్రధాన నగరాలు మారుమ్రోగుతున్నాయి.

బోస్టన్‌, చికాగోతో పాటు న్యూయార్క్‌ టైమ్‌ స్క్వేర్‌ వద్ద హ్యాండ్స్‌ ఆఫ్‌ ఇరాన్‌ స్లోగన్లు ఉన్న బ్యానర్లు ప్రదర్శిస్తూ కొందరు ఈ ప్రదర్శనలు చేపట్టారు. వైట్‌హౌజ్‌ వద్ద జరిగిన నిరసనల్లో పశ్చిమాసియా ఉద్రిక్తతల్లో అమెరికా జోక్యం చేసుకోవద్దంటూ నినాదాలు చేశారు.

ఇరాన్‌పై అమెరికా యుద్ధ విమానాలు దాడులు జరిపి.. తిరిగి ఈ ఉదయం వెనక్కి వచ్చాయి. ఆపరేషన్‌ మిడ్‌నైట్‌ హామర్‌ పేరుతో కేవలం 25 నిమిషాల్లోనే ఇరాన్‌ అణుశుద్ధి కేంద్రాలను (ఫోర్దో, ఇస్ఫాహాన్‌, నటాంజ్‌) దాడులు జరిపినట్లు అమెరికా సైన్యం ప్రకటించుకుంది. ఈ నేపథ్యంలో.. యుద్ధ వ్యతిరేక నిరసనలు తీవ్రతరం అయ్యాయి. 

మరోవైపు.. నిరసనల నేపథ్యంలో అక్కడి భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. దౌత్య కార్యాలయాలతో పాటు మతపరమైన కేంద్రాల వద్ద భద్రత కట్టుదిట్టం చేసినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.  ఇప్పటికే పలువురు నిరసనకారుల్ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

అయితే అమెరికా సైన్యం జరిపిన దాడుల్లో ఇరాన్‌కు భారీ నష్టమే వాటిల్లిందని స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ యుద్ధంలో జోక్యంతో అమెరికా ఘోర తప్పిదం చేసిందంటూ ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా ఖమనీ మండిపడగా.. ‘ఆపరేషన్ రైజింగ్‌ లయన్‌’ పేరుతో తాము చేపట్టిన యుద్ధం సుదీర్ఘంగా కొనసాగబోదని.. దాడుల్లో తాము లక్ష్యానికి చేరువైనట్లు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహూ తాజాగా ఓ ప్రకటన చేశారు.  వెల్లడించారు.

ఇరాన్‌పై అమెరికా బాంబు దాడుల చేసిన తర్వాత.. 

యుద్ధాన్ని ఆపేది అప్పుడే: నెతన్యాహు
ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లోని ఫోర్డో అణుకేంద్రాన్ని అమెరికా (USA) తీవ్రంగా ధ్వంసం చేసింది. అణ్వాయుధ కార్యక్రమంలో ఇరాన్‌ను వెనక్కి నెట్టాం. ముప్పును తొలగించుకున్నాం. లక్ష్యాలను సాధించడానికి అవసరానికి మించి మా చర్యలను కొనసాగించబోం. మా టార్గెట్‌ను చేరుకుంటే ఆపరేషన్‌ పూర్తయినట్లే. అప్పుడు యుద్ధం కూడా ఆగుతుంది. ప్రస్తుత ఇరాన్‌ పాలకులు మమ్మల్ని తుడిచిపెట్టాలని చూశారు. అందుకే ఈ ఆపరేషన్‌ చేపట్టాల్సి వచ్చింది. ఇందులో ప్రధానంగా మా అస్థిత్వానికి పొంచి ఉన్న రెండు ముప్పులను తొలగించాలనుకున్నాం. ఒకటి అణ్వాయుధాలు.. రెండు బాలిస్టిక్‌ క్షిపణులు. ఈ లక్ష్యాలను సాధించే దిశగా మేం ఒక్కో అడుగు వేస్తూ ముందుకుసాగుతున్నాం. వాటికి మేం చేరువయ్యాం. టెహ్రాన్‌తో సుదీర్ఘకాలం యుద్ధం కొనసాగించబోం. అయితే, అనుకున్న ఫలితం రాకముందే పోరాటం నుంచి నిష్క్రమించేది లేదు. 

ఐరాస స్పందన.. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం నిర్వహించింది. అందులో ఐరాసలో ఇరాన్‌ రాయబారి అమీర్‌ సయీద్‌ ఇరవానీ మాట్లాడుతూ.. ‘‘అమెరికా విదేశాంగ విధానాన్ని హైజాక్‌ చేసి.. నెతన్యాహు అగ్రరాజ్యాన్ని ఈ యుద్ధంలోకి లాగారు. అమెరికా చరిత్రలో ఇది మాయని మచ్చగా మిగిలిపోనుంది. దౌత్యాన్ని నాశనం చేయడానికి అగ్రరాజ్యం కంకణం కట్టుకుంది. దీనికి సరైన సమయంలో దీటుగా బదులిస్తాం’’ అని హెచ్చరించారు.

ఖమేనీ ఏమన్నారంటే.. యూదు శత్రువులు ఘోర తప్పిదం చేశారు. తీవ్ర నేరానికి పాల్పడ్డారు. దీనికి శిక్ష తప్పదు. తక్షణమే శిక్షించాల్సిన అవసరం ఉంది అని అమెరికా పేరును ప్రస్తావించకుండానే సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ చేశారు. ఇరాన్‌ అధ్యక్షుడు మసౌద్‌ పెజెష్కియాన్‌ ఏమన్నారంటే.. తాజా దాడులకు అగ్రరాజ్యం మూల్యం చెల్లించుకోవాల్సిందే. అమెరికాకు దీటుగా బదులిస్తాం అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement