ఇంతకీ గెలిచిందెవరు? | Israel and US and Iran all claim to have won the war: but who has really gained | Sakshi
Sakshi News home page

ఇంతకీ గెలిచిందెవరు?

Jun 25 2025 2:30 AM | Updated on Jun 25 2025 2:30 AM

Israel and US and Iran all claim to have won the war: but who has really gained

ఎవరికి వారే గెలుపును తమ ఖాతాలో వేసుకున్న ఖమేనీ, ట్రంప్, నెతన్యాహూ

వాస్తవానికి ఎవరు ఎక్కువ ప్రయోజనం పొందారు? 

అసలు ఈ కాల్పుల విరమణ పూర్తిస్థాయిలో అమలవుతుందా? 

పన్నెండు రోజులపాటు భీకరంగా సాగి కాల్పుల విరమణ ఒప్పందం దిశగా పయనించిన ఇజ్రాయెల్, ఇరాన్‌ యుద్ధంలో తామే విజయం సాధించామని ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఎవరికి వారు ప్రకటించుకున్నారు. తన వల్లే యుద్ధం ఆగిందని ట్రంప్‌ ఇప్పటికే ప్రకటించుకోగా, తమ ప్రయత్నం కారణంగానే సమరం సమసిపోయిందని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ, ఇరాన్‌ సుప్రీంనేత అయతొల్లా అలీ ఖమేనీ ప్రకటించారు.

దీంతో ఈ ఘర్షణలో నిజంగా గెలుపు జెండా ఎవరు ఎగరేశారనే అంశంపై చర్చ మొదలైంది. అయితే ప్రతి ఒక్కరూ ఎంతో కొంత విజయం సాధించారనే వాదనా వినిపిస్తోంది. అణుక్షేత్రాలను కుప్పకూల్చి ఇరాన్‌ కోలుకోలేని దెబ్బతీశానని అమెరికా ప్రకటించుకుంది. సైన్యాధికారులు, అణుశాస్త్రవేత్తలుసహా వైమానిక స్థావరాలు, క్షిపణి లాంచర్లను నాశనంచేసి ఇరాన్‌కు బుద్ధి చెప్పానని ఇజ్రాయెల్‌ గొప్పలు పోయింది. అమెరికాను సైతం ఎదిరించి పోరాడి తమ సత్తా చూపామని ఇరాన్‌ ప్రకటించుకుంది. ఈ నేపథ్యంలో యుద్ధాగ్ని నుంచి ఎవరు ఏ ప్రయోజనాలు పొందారనేది ఆసక్తికరంగా మారింది.

ట్రంప్‌కు శాంతిదూతగా మార్కులు
ఇజ్రాయెల్‌– హమాస్‌ యుద్ధం, ఉక్రెయి న్‌–రష్యా యుద్ధంలో జోక్యం చేసుకుని శాంతిస్థాపనకు శతథా ప్రయత్నించానని ట్రంప్‌ చెప్పుకున్నారు. అయితే అక్కడ విఫలమైనా ఇజ్రాయెల్‌–ఇరాన్‌ యుద్ధాన్ని ఆపి సఫలీకృతుడిని అయ్యానని ట్రంప్‌ చెబుతున్నారు. శాంతిని కోరుకుంటూనే ఫోర్డో అణుకేంద్రంపై బాంబులేయడమేంటని అమెరికాలోనూ ట్రంప్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి.

దోహాలోని తమ స్థావరంపై ఇరాన్‌ బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించినా  ట్రంప్‌ సంయమనం కోల్పోలేదు. ఈ విషయంలో ట్రంప్‌కు మంచి మార్కులు పడ్డాయి. శాంతికాముకులు ట్రంప్‌ నిర్ణయాన్ని మెచ్చుకున్నారు. శాంతి నోబెల్‌ కోసం ఎదురుచూస్తున్న ట్రంప్‌ ఆశలు ఈ కాల్పుల విరమణతో చిగురించినట్లే భావించాలి.

గగనతలంపై ఇజ్రాయెల్‌ విజయం
క్షిపణి లాంచర్లను నాశనం చేయడం ద్వారా ఇరాన్‌ గగనతలంపై తాము పూర్తి పట్టుసాధించామని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ ప్రకటించారు. ఇది తన ఘన విజయమని చెప్పారు. ఇరాన్‌లో ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్‌ కోర్‌ ఉన్నతాధి కారులు, అణు శాస్త్రవేత్తలను అంతంమొందించారు. సైనిక, వైమానిక స్థావరాలను ధ్వంసంచేశారు. అణుకేంద్రాలు, మౌలిక వసతు లను కోలు కోనంతగా దెబ్బ తీశారు.

ఇవన్నీ తన విజ యాలేనని నెతన్యా హూ సొంత డబ్బా భజా యించారు. శత్రుదేశాన్ని పలు రకాలుగా దెబ్బ కొట్టడం ద్వారా ఒక రకంగా నెతన్యా హూ భారీ స్థాయిలో పాపులారిటీ, ప్రజాదరణను పెంచుకున్నారు. వచ్చే ఏడాది తమ దేశంలో జరగబోయే ఎన్నికల్లో ఈ యుద్ధపర్వం నెతన్యాహూ పార్టీ విజయావకాశాలు అమాంతం పెంచింది. యుద్ధంలో తనకు తోడుగా అగ్రరాజ్యం కలిసివచ్చేలా ట్రంప్‌ను ఒప్పించడంలోనూ నెతన్యాహూ విజయం సాధించారు.

అగ్రరాజ్యాన్నీ ఢీకొట్టగలనని ఇరాన్‌ సంకేతం
తమ ఉనికే ప్రశ్నార్థకమైతే అగ్రరాజ్యం అమెరికాను సైతం ఢీకొట్టగలమని దోహా యూఎస్‌ స్థావరంపై క్షిపణి దాడులతో ఇరాన్‌ నిరూపించింది. ఘర్షణ మరింతగా విస్తరించకుండా గౌరవప్రదంగా యుద్ధక్షేత్రం నుంచి ఎలా నిష్క్రమించాలో తమకూ తెలుసునని ఇరాన్‌ రుజువు చేసింది. పశ్చిమాసి యాలో ఎ న్నో దేశాల్లో అమెరికా స్థావరా లున్నా తమకు మిత్రదే శమైన ఖతార్‌లోని స్థావ రం మీదనే ఇరాన్‌ వ్యూహా త్మకంగా క్షిపణుల్ని ప్రయోగించింది.

అమెరికా, ఇరాన్‌ కయ్యా నికి తమ భూభాగం రణక్షే త్రంగా మారొద్దని ఖతార్‌ సైతం మధ్యవర్తిత్వానికి ముందుకు రావాలనే వ్యూహంతో ఇరాన్‌ కేవలం అల్‌ ఉదేయిద్‌ బేస్‌పైనే దాడులు చేసింది. వందల కేజీల యురేనియంను దాచిపెట్టి మధ్యవర్తి త్వానికి తన వైపు కొన్ని అస్త్రాలున్నాయని ప్రపంచానికి చాటిచెప్పింది.

కొసమెరుపు
ఇప్పటికే హమాస్‌– ఇజ్రాయెల్‌ పోరు, ఉక్రెయిన్‌–రష్యా రణం, హౌతీ తిరుగుబాటుదారులు చమురునౌకలపై దాడులతో అధిక పెట్రో ధరల కత్తి గుచ్చుకుంటుందన్న భయాలతో ప్రపంచదేశాలు అల్లాడుతున్న వేళ 12 రోజులకే ఇజ్రాయెల్, ఇరాన్‌ వార్‌ కంచికి చేరడం అందరికీ పెద్ద ఊరట. అయితే అంతెత్తున ఎగసిన యుద్ధజ్వాలలు పూర్తిగా ఆరిపోతాయో లేదోనన్న అనుమానాలూ ప్రపంచదేశాలను పట్టిపీడిస్తున్నాయి.

ఈ దేశాలు నివురుగప్పిన నిప్పులా ఉన్న విద్వేషాలను మళ్లీ రాజేసుకుని పశ్చిమాసియా ప్రశాంతతకు గండి కొడతాయేమోనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ దాడులతో పాఠం నేర్చుకున్న ఇరాన్‌ మళ్లీ అత్యంత రహస్యంగా యురేనియంను వేరే చోట శుద్ధిచేస్తే పరిస్థితి ఏంటి? అనే ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేని పరిస్థితీ ఉంది. అందుకే వీలైనంత త్వరగా శాంతిచర్చలు మొదలెట్టి దీనికి శాశ్వత పరిష్కారం కనుక్కోవడం అత్యావశ్యకం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement