ఆగిన దాడులు! | Iran-Israel ceasefire takes hold as Trump applies pressure | Sakshi
Sakshi News home page

ఆగిన దాడులు!

Jun 25 2025 2:08 AM | Updated on Jun 25 2025 5:50 AM

Iran-Israel ceasefire takes hold as Trump applies pressure

యుద్ధం ముగిసిందంటూ తొలుత ట్రంప్‌ ప్రకటన

అయినా కొనసాగిన దాడులు, విమర్శలు 

ట్రంప్‌ ఆగ్రహంతో తగ్గిన ఇజ్రాయెల్, ఇరాన్‌ 

స్వాగతించిన భారత్, ప్రపంచ దేశాలు 

గగనతలం తెరిచిన ఇజ్రాయెల్‌ 

ఇరాన్‌లో అధికార మార్విడి ఉద్దేశం లేదన్న ట్రంప్‌

టెహ్రాన్‌/టెల్‌ అవీవ్‌/వాషింగ్టన్‌/జెరూసలేం: యుద్ధజ్వాలలతో భగ్గుమన్న పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఎట్టకేలకు తగ్గుముఖం పట్టాయి. పట్టపగ్గాల్లేని ప్రతీకారాలతో రణాగ్ని రాజేసిన ఇజ్రాయెల్, ఇరాన్‌ శాంతించాయి. ఇజ్రాయెల్‌కు దన్నుగా ఇరాన్‌పై బంకర్‌ బాంబుల వర్షం కురిపించిన అమెరికా, ఆ తర్వాత తీరిగ్గా శాంతిమంత్రం జపించింది. తన కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఇరు దేశాలూ అంగీకరించాయని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మంగళవారం తెల్లవారుజామున ప్రకటించారు. కానీ అప్పటినుంచి రోజంతా పలు నాటకీయ పరిణామాలు జరిగాయి.

ఇరాన్, ఇజ్రాయెల్‌ దాడుల పర్వం యథేచ్ఛగా కొనసాగింది. దాంతో ట్రంప్‌ తీవ్ర అసహనం వెలిబుచ్చారు. ఒక దశలో ఇజ్రాయెల్‌పై కన్నెర్రజేశారు. తర్వాత ఎట్టకేలకు ఇరుదేశాలు కాల్పుల విరమణకు అంగీకరించడంతో 12 రోజులుగా సాగుతున్న పోరుకు ప్రస్తుతానికి తెర పడింది. ఈ పరిణామాన్ని భారత్‌తో పాటు ప్రపంచ దేశాలన్నీ స్వాగతించాయి. అయితే కాల్పుల విరమణ షరతులేమిటి, ఇరు దేశాలు వాటిలో ఎన్నింటికి, ఏ మేరకు అంగీకరించాయి వంటివన్నీ ప్రస్తుతానికైతే జవాబుల్లేని ప్రశ్నలే! 

ట్రంప్‌ తిట్ల వర్షం 
సంపూర్ణ కాల్పుల విరమణకు ఇజ్రాయెల్, ఇరాన్‌ అంగీకరించాయంటూ మంగళవారం తెల్లవారుజామున ట్రంప్‌ తన సామాజిక మాధ్యమం‘ట్రూత్‌ సోషల్‌’లో పోస్టు చేశారు. ‘‘కాల్పుల విరమణ మరో ఆరు గంటల తర్వాత నెమ్మదిగా అమల్లోకి వస్తుంది. ఇరు దేశాలూ సైనిక చర్యల నుంచి వెనుదిరుగుతాయి. రెండు దేశాలను అభినందిస్తున్నా. ఈ యుద్ధం కొనసాగితే పశ్చిమాసియా భస్మీపటలం అవుతుంది. అంతదాకా పోనివ్వను. కాల్పుల విరమణతో ప్రపంచం, పశ్చిమాసియా శాంతిని గెల్చుకున్నాయి’’ అని చెప్పుకొచ్చారు. విరమణ వెనుక ఖతార్‌ ప్రధాని షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ అబ్దుల్‌రహీమ్‌ అల్‌ థానీ కృషి కూడా ఉందని అమెరికా ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కానీ ట్రంప్‌ ప్రకటన తర్వాత కూడా ఇజ్రాయెల్, ఇరాన్‌ పరస్పర దాడులు కొనసాగాయి.

తమకు ఎలాంటి విరమణ ప్రతిపాదనా రాలేదని ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్‌ కోర్‌ తొలుత ప్రకటించింది. మంగళవారం ఉదయం ఇజ్రాయెల్‌లోని బీర్‌òÙబా సిటీపై క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడిలో నలుగురు చనిపోయారు. అనంతరం ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ ఒక ప్రకటన విడుదల చేశారు. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ తాము దాడులు చేశామన్న ఆరోపణలను తోసిపుచ్చారు. అయితే, తొలుత దాడులు చేసింది ఇజ్రాయెలేనని గుర్తు చేశారు. వాళ్లే ముందుగా దాడులు ఆపితే తామూ ఆపుతామని ప్రకటించారు. తర్వాత దక్షిణ, ఉత్తర ఇరాన్‌ ప్రాంతాలపై ఇజ్రాయెల్‌ దాడుల్లో పలువురు చనిపోయారు. టెహ్రాన్‌ సమీపంలోని రాడార్‌ వ్యవస్థలపైనా ఇజ్రాయెల్‌ క్షిపణులు, బాంబులతో దాడులు చేసింది.

మళ్లీ ఉల్లంఘనకు పాల్పడితే దీటుగా బదులిస్తామని హెచ్చరించింది. అయినా ఇరాన్‌ దాడులను ఉధృతం చేయడంతో మరోసారి ప్రతిదాడులకు దిగింది. ఈ పరిణామాలపై ట్రంప్‌ మండిపడ్డారు. రెండు దేశాలూ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడ్డాయంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆ క్రమంలో వాటినుద్దేశించి పలు బూతు మాటలు కూడా ప్రయోగించారు. ‘‘బాంబులేయడం ఆపండి. మీ పైలట్లను వెంటనే వెనక్కి పిలిపించండి’’ అంటూ ఇజ్రాయెల్‌కు అలి్టమేటమిచ్చారు. యుద్దం మొదలయ్యాక ఇజ్రాయెల్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తంచేయడం ఇదే తొలిసారి. ‘‘ఇరాన్‌ ఇక ఎప్పటికీ అణ్వస్త్రదేశంగా అవతరించబోదు. అణుబాంబును తయారు చేయబోదు’’ అంటూ ట్రంప్‌ ప్రకటించారు. అయితే ఇరాన్‌లో ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం మాత్రం అమెరికాకు లేదని స్పష్టం చేశారు.

తర్వాత ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూతో ఫోన్‌లో మాట్లాడారు. దాంతో కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నట్లు నెతన్యాహూ ప్రకటించారు. అయితే ఆ తర్వాత కూడా ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో బాంబుల మోతలు విని్పంచినట్టు తెలుస్తోంది. యుద్దం మొదలైననాటి నుంచి ఇరాన్‌లో 974 మంది చనిపోయారని, 3,458 మందికిపైగా గాయపడ్డారని వాషింగ్టన్‌ కేంద్రంగా పనిచేసే హ్యూమ్‌ రైట్స్‌ యాక్టివిస్ట్స్‌ సంస్థ ప్రకటించింది. తమ దేశంలో 28 మంది చనిపోయారని, 1,000 మందికిపైగా గాయపడ్డారని ఇజ్రయెల్‌ పేర్కొంది. కొద్దిరోజులుగా మూసేసిన తన గగనతలాన్ని మంగళవారం సాయంత్రం తిరిగి తెరిచింది. పశ్చిమాసియా దేశాలకు విమాన సరీ్వసులను బుధవారం నుంచి పునరుద్ధరిస్తున్నట్టు  ఎయిరిండియా ప్రకటించింది.

పరిష్కారానికి తోడ్పడతాం
ఇరాన్‌–ఇజ్రాయెల్‌ నడుమ ఘర్షణలను తగ్గించడంలో తన వంతు పాత్ర పోషించడానికి సిద్ధమని భారత్‌ ప్రకటించింది. ‘‘యుద్ధం ఏ సమస్యలకూ పరిష్కారం కాదు. చర్చలే ఏకైక మార్గం. ముందనుంచీ ఇదే భారత్‌ వైఖరి’’ అని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది

మరో శాస్త్రవేత్త మృతి
అణు కార్యక్రమంలో ఇరాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశ అణు కార్యక్రమానికి అత్యంత కీలకమైన శాస్త్రవేత్త మొహమ్మద్‌ రెజా సెదీఘీ సాబర్‌ను ఇజ్రాయెల్‌ హతమార్చింది. మంగళవారం తెల్లవారుజామున ఉత్తర ఇరాన్‌లోని ఆస్తనీయే అష్రాఫీయేలో తల్లిదండ్రుల ఇంట్లో ఉన్న ఆయనపై దాడి చేసింది. జూన్‌ 13న జరిగిన దాడి నుంచి రెజా తప్పించుకున్నా ఆయన 17 ఏళ్ల కుమారుడు చనిపోయాడు. రెజాపై అమెరికా గతంలోనే ఆంక్షలు విధించింది. ఆయన మృతితో తాజా పోరులో భాగంగా ఇజ్రాయెల్‌ హతమార్చిన ఇరాన్‌ అణుశాస్త్రవేత్తల సంఖ్య ఏకంగా 14కు పెరిగింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement