
ఇజ్రాయెల్తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ ఇంటర్నెట్ సర్వీసుల సామర్థ్యాన్ని పరిమితం చేస్తూ ఇటీవల దేశవ్యాప్తంగా దాదాపు ఇంటర్నెట్ బ్లాక్అవుట్(ఇంటర్నెట్లో తీవ్ర అంతరాయం-పూర్తి బ్లాక్అవుట్ కాదు)ను ఎదుర్కొంది. ఇజ్రాయెల్ సైబర్ దాడులకు పాల్పడుతుందని, అందుకు ప్రతిస్పందనగా ప్రభుత్వం ఈ మేరకు ఇంటర్నెట్ను పరిమితం చేస్తూ ఉద్దేశపూర్వకంగా నిర్ణయం తీసుకున్నట్లు మీడియా నివేదికలు సూచిస్తున్నాయి.
ఇరాన్ ప్రభుత్వ నిర్ణయం ద్వారా వీపీఎన్(వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్) సేవలు ప్రధానంగా ప్రభావితమయ్యాయి. తప్పుడు సమాచారం వ్యాప్తిని అణచివేయాలని దాంతోపాటు సైబర్ దాడులను అరికట్టాలని ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నట్లు కొన్ని సంస్థలు తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ కనెక్టివిటీని ట్రాక్ చేసే కంపెనీలు కెంటింక్, నెట్బ్లాక్స్ను ఉటంకిస్తూ ఎన్బీసీ తెలిపిన నివేదిక ఆధారంగా ఇరాన్ స్థానిక కాలమానం ప్రకారం జూన్ 17, సాయంత్రం 5:30 గంటలకు ఇంటర్నెట్ సేవలు పరిమితమయ్యాయి. ఇది పూర్తిగా బ్లాక్అవుట్ కాదు. విదేశీ వెబ్సైట్లకు కనెక్ట్ అయ్యేందుకు అనుమతించే వీపీఎన్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. వ్యక్తిగత సమాచారాన్ని లీక్ చేస్తారనే ఆందోళనలతో వాట్సప్ వంటి యాప్లను ఉపయోగించకుండా ఉండాలని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది.
ఇదే మొదటిసారి కాదు..
ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్ను నిలిపివేయడం లేదా ప్రజలు ఇంటర్నెట్ సేవలను యాక్సెస్ చేయకుండా నిరోధించడం ఇది మొదటిసారి కాదు. 2019లో దేశంలో నెలకొన్న అంతర్యుద్ధం కారణంగా వరుసగా ఆరు రోజుల పాటు పూర్తిగా లాక్డౌన్ విధించింది. అప్పుడు 100 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఇజ్రాయెల్పై దాడుల తర్వాత 220 మందికి పైగా మరణించారని ఇరాన్ చెబుతుండగా, ప్రతీకార దాడుల్లో 24 మంది మరణించారని ఇజ్రాయెల్ చెబుతోంది.
ఇదీ చదవండి: పుత్తడి ఈ పూట రేటెంతంటే..
గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ కూడా..
గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లను కూడా ఇరాన్ నిలిపేసింది. ప్రజలు తమ డివైజ్లలో కొత్త యాప్లను డౌన్లోడ్, ఇన్స్టాల్ చేసుకోకుండా నిషేధం విధించింది. అదే సమయంలో వాట్సప్, ఇన్స్టాగ్రామ్ వంటి యాప్స్ ఇప్పటికే ఉన్న డివైజ్లలో పూర్తిగా నిరుపయోగంగా మారాయి. ఇరాన్ నేషనల్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్లో భాగమైన ప్రభుత్వం ఆమోదించిన సైట్లు అందుబాటులో ఉన్నాయి.