ఇరాన్‌ యుద్ధ నౌకపై అమెరికా దాడి  | Iran warship Iris Dena sunk in torpedo attack near Sri Lanka | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ యుద్ధ నౌకపై అమెరికా దాడి 

Mar 5 2026 4:27 AM | Updated on Mar 5 2026 4:27 AM

Iran warship Iris Dena sunk in torpedo attack near Sri Lanka

శ్రీలంక సమీప సముద్ర జలాల్లో మునక 

87 మంది మృతి 

పలువురి జాడ గల్లంతు 

32 మందిని కాపాడిన శ్రీలంక నావికాదళం

కొలంబో: పశ్చిమాసియా యుద్ధజ్వాలలను అమెరికా దక్షిణాసియాకూ వ్యాపింపజేసింది. విశాఖపట్నంలో గత నెలలో అంతర్జాతీయ నావికా విన్యాసాల్లో పాల్గొని స్వదేశానికి బయల్దేరిన ఇరాన్‌కు చెందిన యుద్ధనౌక ‘ఐఆర్‌ఐఎస్‌ దేనా’పై అమెరికా దాడిచేసింది. అమెరికా జలాంతర్గామి నుంచి దూసుకొచ్చిన టోర్పెడో ధాటికి ‘ఐఆర్‌ఐఎస్‌ దేనా’యుద్ధనౌక మంగళవారం రాత్రి ముక్కలుచెక్కలై శ్రీలంక సమీప సముద్రజలాల్లో మునిగిపోయింది. 

ఈ ఘటనలో కనీసం 87 మంది నావికాసిబ్బంది జలసమాధి అయ్యారు. పలువురు నావికుల జాడ గల్లంతైంది. నౌక మునిగిపోయాక లైఫ్‌జాకెట్లతో సముద్రజలాలపై ఈదుతున్న 32 మందిని సమీపంలోని శ్రీలంక నావికాదళాలు రక్షించాయి. గాయపడిన వారిని సమీప నగర ఆస్పత్రిలో చేరి్పంచారు. నౌకపై దాడి చేసింది తామేనని అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ బుధవారం అధికారికంగా ప్రకటించారు.

 దాడి వివరాలను పెంటగాన్‌లోని రక్షణశాఖ కార్యాలయంలో మీడియాకు మంత్రి హెగ్సెత్‌ వెల్లడించారు. ‘‘యుద్ధం వేళ హిందూ మహాసముద్ర జలాల్లో శత్రుదేశ యుద్ధనౌక జాడ కనిపెట్టాం. అందుకే టోర్పెడోతో దానిని నాశనంచేశాం. రెండో ప్రపంచయుద్దం తర్వాత శత్రువుల నౌకను జలాంతర్గామితో ధ్వంసంచేయడం ఇదే తొలిసారి’’అని ఆయన వ్యాఖ్యానించారు. 

శ్రీలంక నైరుతి దిశలో గల్లే నగర సముద్ర తీరం నుంచి 75 కి.మీ.ల దూరంలో సముద్రజలాల్లో నౌక మునిగిపోతోందని, కాపాడాలని శ్రీలంక తీరగస్తీ దళాలకు బుధవారం ఉదయం 5.08 గంటలకు అత్యయిక సందేశం రాగానే వెంటనే శ్రీలంక తమ నావికాదళ నౌకలు, వాయుసేన విమానాలను ఘటనాస్థలికి పంపించింది. యుద్ధనౌకకు చెందిన కొందరు సిబ్బంది లైఫ్‌ జాకెట్లతో సముద్రజలాలపై కన్పించారు. 

గాయపడిన వారిని తొలుత శ్రీలంక నేవీ సదరన్‌ కమాండ్‌ ప్రధానకార్యాలయంలో చేర్పించారు. తర్వాత గాలె నగరంలోని కరపితియా ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి్పంచారు. సముద్రజలాల నుంచి 87 మృతదేహాలను లంక నేవీ స్వా«దీనంచేసుకుంది. ‘‘మేం రక్షించిన 32 మందిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. మరో ఏడుగురిని ఐసీయూలో చేర్పించాం. ఇతరులకు చిన్నపాటి గాయాలయ్యాయి’’అని శ్రీలంక రక్షణ శాఖ కార్యదర్శి ఎయిర్‌ వైస్‌మార్షల్‌ సంపథ్‌ థుయకొంతా చెప్పారు. రెస్క్యూ ఆపరేషన్‌ వివరాలను శ్రీలంక విదేశాంగ మంత్రి విజిథ హెరాత్‌ పార్లమెంట్‌లో వెల్లడించారు.

 ‘‘ప్రమాద సమయంలో నౌకలో దాదాపు 180 మంది ఉన్నారు. మన బలగాలు అక్కడికి చేరుకునేలోపే నౌక మునిగిపోయింది. గాయపడి ఈదుతున్న నావికులను బలగాలు కాపాడాయి’’అని మంత్రి చెప్పారు. ‘‘ఘటనాస్థలి వాస్తవానికి మా సముద్రజలాల పరిధిలో లేదు. కానీ గాలింపు, సహాయక చర్యలు చేపట్టే దూరం మాత్రం మా పరిధిలోనే ఉంది. అందుకే మేం స్పందించాం’’అని శ్రీలంక నావికాదళ అధికార ప్రతినిధి బుద్ధిక సంపత్‌ వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలో ఫిబ్రవరి మూడోవారంలో జరిగిన ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ–2026 వైమానిక విన్యాసాల్లో ఇరాన్‌కు చెందిన ఈ మౌడ్జ్‌ తరగతి స్వదేశీ, వేగంగా వెళ్లే తేలికపాటి యుద్ధనౌక సైతం పాల్గొంది. 

ఐఆర్‌ఐఎస్‌ దేనా నౌకలో భారీ స్థాయిలో గన్‌లతోపాటు భూతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణులు, యాంటీ–íÙప్‌ మిస్సైళ్లు, టోర్పెడోలు ఉన్నాయి. దీని మీద హెలికాప్టర్‌ను ల్యాండ్‌చేయొచ్చు. దీనికి తోడుగా ఐఆర్‌ఐఎస్‌ మక్రాన్‌ అనే మరో చిన్న నౌక అంతర్జాతీయ జలాల్లో పెట్రోలింగ్‌ బాధ్యతలు నిర్వర్తించేది. అయితే ఉక్రెయిన్‌లో జనావాసాలపై దాడులకు ఉపయోగించిన మారణాయుధాలను ఈ నౌకల్లోనే రష్యాకు సరఫరాచేశారన్న ఆరోపణలపై వీటిపై అమెరికా ఆర్థికశాఖ 2023 ఫిబ్రవరిలో ఆంక్షలు విధించింది. ఇరాన్‌ నౌకలను నాశనంచేయడమే తమ లక్ష్యమని అమెరికా మిలటరీ సెంట్రల్‌ కమాండ్‌ సారథి అడ్మిరల్‌ బ్రాడ్‌ కూపర్‌ వ్యాఖ్యానించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement