ఎమ్మెల్యే అవుతానని మరోసారి పేర్కొన్న సుస్మితాపటేల్
కొండా మురళి సమక్షంలోనే వ్యాఖ్యలతో రాజకీయ వేడి
ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి వర్గంతో తరచూ విభేదాలు
అయోమయ పరిస్థితిలో కాంగ్రెస్ కేడర్
సాక్షి, వరంగల్: గీసుకొండ నుంచి పరకాల టార్గెట్గా ‘కొండా’ వ్యాఖ్యలు రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. గతంలోనే పరకాల నుంచి ఎమ్మెల్యే అవుతానని ట్విట్టర్ ద్వారా పోస్టు చేసిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు, మంత్రి కొండా సురేఖ దంపతుల కుమార్తె సుస్మితాపటేల్ (చిట్టక్క).. తాజాగా కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతర సాక్షిగా తన తండ్రి మురళీధర్రావు దీవెనలు, గీసుకొండ మండల ప్రజల అండతో ఎమ్మెల్యే అవుతానని మాట్లాడడంతో కాంగ్రెస్ పార్టీలో రాజకీయ కాక రేపినట్లయ్యింది. ఆమె మాటలకు అనుకూలంగానే కొండా కుటుంబాన్ని గతంలో ఆశీర్వదించినట్లుగా భవిష్యత్లో కూడా ఆదరించాలని కొండా మురళి మాట్లాడడంతో పొలిటికల్ హీట్ పుట్టించినట్లయ్యింది.
ఎవరు అడ్డొచ్చినా కొండా సుస్మిత అదరదు బెదరదని, ఇది అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించారు. తప్పకుండా పరకాల నుంచే తన కుటుంబం రేసులో ఉంటుందని ఆయన విస్పష్టంగా ప్రకటించడంతో మరోసారి పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ వార్ తెరమీదకు వచ్చినట్లయ్యింది. గతంలో కూడా ఎమ్మెల్యే అభ్యర్థి అంటూ సుస్మితాపటేల్ బ్యానర్లు వెలిసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇలా కొండా, రేవూరి వర్గాలతో కాంగ్రెస్ పార్టీ కేడర్లో అయోమయ పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొండా చేసిన ఈ వ్యాఖ్యల మర్మం వెనుక రాజకీయ మతలబు దాగి ఉందని, వరంగల్ తూర్పులో కూడా కొండా వ్యతిరేక వర్గాలు ఉండడంతో అదే సిద్ధాంతాన్ని పరకాలలో ప్రయోగించి.. పార్టీలో తమ పట్టు నిలుపుకోవాలన్న ఎత్తుగడలో భాగమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అప్పుడు దసరా.. ఇప్పుడు హోలీ
● 2024 మే 8న గీసుకొండ మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు రడం భరత్ విషయంలో మంత్రి, ఎమ్మెల్యే మధ్య జరిగిన ఫోన్లో వాగ్వాదం సోషల్ మీడియాలో వైరలైంది. తన మనిషిని కాదని ఇతరులకు పదవుల్లో ఎలా ప్రాధాన్యమిచ్చారంటూ రేవూరిని ఆమె ప్రశ్నించారు. మా వల్లే మీరు గెలిచారు.. నియోజకవర్గంలోని సొంత మండలం గీసుకొండలో మేం చెప్పినట్లే నడవాలని అప్పట్లో ఫోన్లో మాట్లాడిన మాటలు ఆడియో లీక్ అవడం సంచలనంగా మారింది. అంతకుముందే తనకు తెలియకుండా పలు మండలాలకు చెందిన వారిని పార్టీలోకి తీసుకోవడంపై ఎమ్మెల్యే అసంతృప్తితో ఉన్నారు. ఇదే విషయమై గీసుకొండ మండలంలోని కొండా వర్గానికి చెందిన ఒకరిపై పరకాలలో కేసు కూడా నమోదైంది. మాజీ ఎంపీపీ భీమగాని సౌజన్యపై మంత్రి బాహాటంగానే అప్పుడు విమర్శలు గుప్పించారు.
● 2024 అక్టోబర్ 13న దసరా పండుగను పురస్కరించుకొని గీసుకొండ మండలం ధర్మారంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే రేవూరి ఫొటో లేదని ఆయన వర్గీయులు దాన్ని ధ్వంసం చేశారు. ఈక్రమంలో కొండా వర్గీయులు దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు కొండా వర్గానికి చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. గీసుకొండ పీఎస్కు వచ్చిన మంత్రి కొండా సురేఖ సీఐ సీటులో కూర్చొని కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కొండా వర్గీయులు అక్కడికి భారీ సంఖ్యలో చేరుకొని, వారిని విడుదల చేయాలంటూ నినాదాలు చేయడంతో హైటెన్షన్ నెలకొంది. ఎమ్మెల్యే రేవూరి మాట్లాడుతూ ఈ విషయం అధిష్టానం దృష్టికి వెళ్లిందని, ఇది పార్టీ అంతర్గత వ్యవహారం కాదని, స్థానికతకు సంబంధించిన విషయమన్న సంగతి తెలిసిందే.
● 2026 మార్చి 3న కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతరను పురస్కరించుకొని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కుమార్తె, కొండా సుస్మితాపటేల్ మాట్లాడుతూ కొండా కుటుంబాన్ని గీసుకొండ ప్రజలు ఆదరించారని, భవిష్యత్లోనూ బాసటగా ఉండాలని సుస్మితాపటేల్ పరకాల నుంచి ఎమ్మెల్యేగా బరిలో ఉంటాననే సంకేతాలను ఇవ్వడం కలకలం రేపింది. దీంతో ఇప్పటికే ఉప్పునిప్పులా ఉంటున్న కొండా, రేవూరి వర్గాలు మరింత దూరమయ్యే పరిస్థితి నెలకొంది. గతేడాది డిసెంబర్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ గీసుకొండ మండలం నుంచి కాంగ్రెస్ పార్టీ 16 స్థానాలు గెలిచింది. కొండా వర్గం 7 స్థానాలు, రేవూరి వర్గం 9 స్థానాలు దక్కించుకుంది. ఇలా గీసుకొండ మండల కేంద్రంగా అధికార పార్టీలోనే రెండు వర్గాలు తమ ప్రాబల్యాన్ని చూపుతుండడం గమనార్హం.


