బడ్జెట్ సమావేశాల్లో ఆత్మస్తుతి, పరనిందకే ప్రాధాన్యం
బాబు, లోకేశ్ భజనకు పోటీపడిన కూటమి ఎమ్మెల్యేలు
సాక్షి, అమరావతి: చంద్రబాబు, ఆయన తనయుడు లేకపోతే ఈ రాష్ట్రమే లేదనే స్థాయిలో అసెంబ్లీలో భజన.. మరోవైపు ఇందాపూర్ డెయిరీతో హెరిటేజ్కు ఉన్న సంబంధం గురించి కనీస ప్రస్తావన కూడా రానీయకుండా కౌన్సిల్లో పలాయనం. 17 రోజులపాటు జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆసాంతం ఆత్మస్తుతి, పరనిందను తలపించాయి.
అసెంబ్లీలో చంద్రబాబును కారణజన్ముడిగా, లోకేశ్ను అపర మేధావిగా, దేవాన్ష్ ను భావినేతగా కీర్తిస్తూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను కూటమి ఎమ్మెల్యేలు చంద్రబాబు కీర్తన సభలుగా మార్చివేశారు. కౌన్సిల్లో మాత్రం బయటపడిన తమ గుట్టుపై చర్చ జరక్కుండా కుతంత్రాలకు దిగజారారు. గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమైన సమావేశాలను లేని గొప్పల్ని చెప్పుకోవడం, గత వైఎస్ జగన్ పాలన గురించి అబద్ధాలు చెప్పడానికే కూటమి ప్రభుత్వం పూర్తిగా ఉపయోగించుకుంది.
అవాస్తవాల బడ్జెట్
14వ తేదీన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా నిధులు కేటాయించకుండా వాటికి తిలోదకాలు ఇస్తున్నట్లు చెప్పకనే చెప్పింది. చేసిన అప్పుల గురించి వాస్తవాలు చెప్పకుండా, ఈ ఏడాది మాత్రం మరో రూ. లక్ష కోట్ల అప్పులు చేస్తామని నిర్భీతిగా బడ్జెట్లో పెట్టడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. బడ్జెట్ ప్రసంగంలో సైతం చంద్రబాబును పొగడ్డానికే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాధాన్యత ఇచ్చారు.
20 నెలలుగా చేసిందేమిటో చెప్పుకోలేక బడ్జెట్ ప్రసంగంలోనూ పదేపదే గత ప్రభుత్వంపై నిందలు మోపే ప్రయత్నం చేశారు. ప్రతిరోజూ జరిగిన ప్రశ్నోత్తరాలు, జీరో అవర్, బడ్జెట్ పద్దులపై జరిగిన చర్చల్లోనూ చంద్రబాబును, లోకేశ్ను ఆకాశానికి ఎత్తేసి వారికి దగ్గరయ్యేందుకు కూటమి సభ్యులు అత్యుత్సాహం చూపారు. జనసేన ఎమ్మెల్యేలు సైతం బాబును పొగిడేందుకు పోటీపడడం గమనార్హం.
జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మరో అడుగు ముందుకేసి చంద్రబాబు, లోకేశ్తోపాటు లోకేశ్ కొడుకు దేవాన్‡్షను కూడా పొగుడుతూ స్వామిభక్తిని చాటుకోవడం చర్చనీయాంశమైంది. పీఏసీ చైర్మన్గా ఉన్న మరో జనసేన ఎమ్మెల్యే రామాంజనేయులు ఏకంగా చంద్రబాబును కారణ జన్ముడిగా అభివర్ణించారు. చర్చ ఏదైనా అందులో బాబు, లోకేశ్ను ఆకాశానికి ఎత్తడం, జగన్ను తిట్టడమే పనిగా అసెంబ్లీ నడించింది.
టీడీపీ నేతల్లా స్పీకర్, డిప్యూటీ స్పీకర్
అదే సమయంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పీకర్ స్థానంలో కూర్చుని టీడీపీ నేతలా ప్రతిపక్షంపైనా, వైఎస్ జగన్పైనా విమర్శలు చేశారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యేలను ఏకవచనంతో సంబోధించడం, వారు మాట్లాడిన తర్వాత దానిపై జడ్జిమెంట్ ఇచ్చేయడం, అది అయ్యే పని కాదంటూ తీర్మానించి చెప్పేయడం, మాట్లాడిన సభ్యులను కామెంట్ చేసి అసెంబ్లీ స్థాయిని దిగజార్చారనే చర్చ అధికారపక్షంలోనే చోటుచేసుకుంది. చివరికి కూటమి ఎమ్మెల్యేలు తాము చేసిన భజనపై తమకే విసుగొచ్చి ప్రతిపక్షం లేకపోతే సభ బాగోలేదంటూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
కౌన్సిల్ సమావేశంలో జరగనీయకుండా కుతంత్రాలు...
మండలిలో ప్రతిపక్ష వైఎస్సార్సీపీ సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రభుత్వం అడ్డగోలు కుతంత్రాలకు తెరలేపింది. ఇందాపూర్ డెయిరీకి హెరిటేజ్ సంస్థకు ఉన్న బంధం గురించి సమాధానం చెప్పలేమనే భయంతో మొత్తం సమావేశాలు స్తంభించేలా వ్యవహరించింది. చంద్రబాబు ఆయన కుమారుడు లోకేశ్ తమ సొంత సంస్థ కోసం మంత్రులు, కూటమి ఎమ్మెల్సీలను ఉపయోగించుకుని ప్రజా సమస్యలు తమకు పట్టవని తేల్చేశారు.
ఇందాపూర్ డెయిరీ–హెరిటేజ్ ప్రస్తావన రాకుండా చేసేందుకు చర్చను కూటమి ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకుంది. స్వయంగా లోకేశ్ మండలికి వచ్చి తమ సంస్థకు మద్దతుగా మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్సీలను మోహరించి చర్చ జరగనీయకుండా చేయడం స్పష్టంగా కనిపించింది.
చర్చకు ఒప్పుకుని చివరికి ప్లేటు ఫిరాయింపు
వరుసగా నాలుగు రోజులు సభను స్తంభింపచేసి చివరికి విమర్శలు వస్తుండడంతో అధికారపక్షం బీఏసీ సమావేశం నిర్వహించి ఇతర అంశాలతోపాటు ప్రతిపక్షం కోరుతున్న అంశంపై చర్చించేందుకు అంగీకరించి ఆ తర్వాత ప్లేటు ఫిరాయించింది. ఇతర అంశాలన్నింటిపై చర్చించేందుకు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ సభ్యులు సహకరించినా.. ఇందాపూర్–హెరిటేజ్ అంశంపై వచ్చేసరికి మాట మార్చి సభా సాంప్రదాయాలను తుంగలో తొక్కింది.
ఈ విషయంలో మండలి చైర్మన్ మోషేన్రాజు అనుమతి లేకుండా మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటన చేయడానికి ప్రయత్నించారు. చైర్ అనుమతి లేకుండా స్టేట్మెంట్కు ప్రయత్నించి చైర్మన్ స్థానాన్ని అవమానించారని మోషేన్ రాజు విచారం వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి సభను తప్పుదోవ పట్టించారని స్వయంగా చైర్మన్ సభలో ప్రకటించడాన్ని బట్టి టీడీపీ ఏ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చు.
ఆ తర్వాత కూడా అదే అంశంపై ప్రతిపక్షం చర్చకు పట్టుబట్టగా మంత్రి అచ్చెన్నాయుడు చైర్మన్కు మతం ఆపాదించి అధ్యక్ష స్థానాన్నే అవమానించి చర్చ జరక్కుండా సమస్యను పక్కదారి పట్టించారు. ఇందాపూర్–హెరిటేజ్ బంధం గురించి మండలిలో చర్చ జరక్కుండా చేసేందుకు చివరికి టీడీపీ మత రాజకీయాలకు దిగి అభాసుపాలైంది. మొత్తంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రజా సమస్యలు కంటె టీడీపీ రాజకీయాలు, చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్ ప్రయోజనాల కోసమే జరిగినట్లు తేటతెల్లమైంది.


