అందుకే ప్రభుత్వమిచ్చే లబ్ధి పెద్ద కుటుంబాలకే ఇస్తా
చిన్న కుటుంబాలను నిరుత్సాహపరుస్తా
ఇద్దరు ముగ్గురు పిల్లలుంటే మగవాళ్లకూ రెండు నెలల సెలవు
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభలో సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: పింఛన్లు, రేషన్ కోసం కుటుంబాలు విడిపోతున్నాయని.. దీనిని నివారించేందుకు కొత్త విధానం తీసుకొస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ప్రభుత్వం ఇచ్చే లబ్ధి చిన్న కుటుంబాలకు కాకుండా పెద్ద కుటుంబాలకే ఇస్తానని చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజధానిలో ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. కుటుంబమే మనకు ఒక భద్రత అన్న విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు.
ఇద్దరు, ముగ్గురు పిల్లలుంటే మహిళలకు మాదిరిగానే పురుషులకు కూడా రెండునెలల వరకు సెలవు ఇస్తానని తెలిపారు. ఒకప్పుడు ముగ్గురు పిల్లలను కనొద్దని చెప్పిన తానే ఇప్పుడు రాష్ట్రంలో జనాభా తగ్గుదల నేపథ్యంలో ‘ముగ్గురు పిల్లలు ముద్దు’ అంటూ ఫ్యామిలీ మ్యానేజ్మెంట్ అంటున్నానన్నారు. ‘రాబోయే పదేళ్లు నేను చెప్పింది వినండి, మీరు మీ కుటుంబం ఆనందంగా ఉండకపోతే అప్పుడు నన్నడగండి’.. అంటూ వ్యాఖ్యానించారు. బాబు ఇంకా ఏమన్నారంటే..
సెర్ప్, మెప్మాను ఒకే గొడుగు కిందకు తెస్తా..
మా పార్టీ అధికారంలో లేనప్పుడు ఆయా ప్రభుత్వాలు పొదుపు సంఘాలను పట్టించుకోలేదు. బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలను 99.89 శాతం తిరిగి కట్టే వ్యవస్థ డ్వాక్రా వ్యవస్థే. రాబోయే రోజుల్లో మెప్మా, డ్వాక్రా (సెర్ప్) రెండింటిని వెలుగు అనే ఒక గొడుగు కిందకు తెస్తా. పొదుపు సంఘాల మహిళలు తయారుచేసే ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా విక్రయించేలా స్వయం పేరుతో ఒక బ్రాండ్ను ప్రారంభించా. ఈ ఏడాది మహిళల్లోనే లక్షల మంది పారిశ్రామికవేత్తలు తయారయ్యారు.
మీకేదైనా అయితే నాకు ఫోను చేయండి..
ఎక్కడో యుద్ధం జరుగుతుంటే మన దగ్గర పెట్రోల్, గ్యాస్ రేట్లు పెరిగే పరిస్థితి ఉంది. ఓపెన్ మార్కెట్లో సిలిండర్ ధరలు పెరిగినా.. మా ఆడబిడ్డలకు నేను ఇచ్చే 3 సిలిండర్లు ఉచితంగానే ఇస్తా. ఐదేళ్లు గంజాయి బ్యాచ్లను తయారుచేశారు. ఆడబిడ్డలకు రక్షణలేకుండా పోయింది. మీకేదైనా జరిగితే నాకు ఫోన్ చేయండి. ఎవడైనా సరే.. తాటతీస్తా. ఇక ఈ కార్యక్రమంలో పొదుపు సంఘాలకు రూ.10,100 కోట్ల రుణాల చెక్కును సీఎం చంద్రబాబు అందజేశారు.


