సాక్షి, అమరావతి: ఈ ఏడాది రాష్ట్రంలో ఎండల తీవ్రత గతం కంటే ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణంగా ఏప్రిల్లో మొదలయ్యే ఎండల తీవ్రత ఈసారి మార్చి రెండో వారం నుంచే మొదలయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు పేర్కొన్నారు.
రాయలసీమలో సాధారణంగా ఉండే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఈసారి 42 నుంచి 44 డిగ్రీలకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో చోటుచేసుకుంటున్న మార్పులే కారణమని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల పగలుతో పాటు రాత్రుళ్లు కూడా వేడి తగ్గకుండా ఉక్కపోత ఎక్కువగా ఉండనుంది.
కోస్తా తీర ప్రాంతాల్లో బయట 38 డిగ్రీలు ఉన్నా, మనకు అది 43 డిగ్రీల ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఈసారి 15 రోజుల కంటే ఎక్కువ కాలం వడగాడ్పులు వీచే ప్రమా దం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.


