స్టేట్ ఫుడ్ కమిషన్ ప్రస్తావించిన లోపాలపై బీసీ గురుకులాల కార్యదర్శి మాధవీలత ప్రిన్సిపల్స్కు జారీ చేసిన ఉత్తర్వులు
బీసీ గురుకులాల్లో దారుణ పరిస్థితులు
ప్రభుత్వానికి రాష్ట్ర ఫుడ్ కమిషన్ నివేదిక
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడి పేద పిల్లలు నీళ్ల చారు, ఉడకని అన్నంతో కడుపునింపుకునే దుస్థితి నెలకొంది. ఈ దారుణ పరిస్థితులపై తాజాగా ఏపీ ఫుడ్ కమిషన్ సమావేశమై చర్చించింది. సమస్యలను ప్రభుత్వానికి నివేదించింది. దీంతో కమిషన్ ప్రస్తావించిన అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని బీసీ గురుకులాల సంస్థ కార్యదర్శి మాధవీలత సంబంధిత ప్రిన్సిపాల్స్కు సర్క్యులర్ జారీ చేశారు.
అధ్వాన్న పరిస్థితులు
ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్రెడ్డి, కమిషన్ సభ్యులు సందర్శించిన గురుకులాల్లో గుర్తించిన దయనీయ అంశాల్లో కొన్ని..
» స్టోర్ రూమ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి.
» అల్పాహారంలో నీళ్ల చట్నీ వేస్తున్నారు.
» ఇడ్లీలు సరిగా ఉడకడం లేదు.
» అన్నం సరిగా వండటం (ఉడకడం)లేదు.
» కొన్ని చోట్ల వండిన అన్నంలో ఎలుక పెంటలు కూడా ఉంటున్నాయి.
» నిల్వ బియ్యాన్ని కనీసం శుభ్రం చేయకుండా వండేస్తున్నారు.
» వండిన ఆహారంలో వెంట్రుకలు కనిపిస్తున్నాయి.
» భోజనంలో కేవలం రెండు చికెన్ ముక్కలు మాత్రమే వేసి ఎక్కువగా గ్రేవీ వేస్తున్నారు.
» రుచిలేని కూరలు.. అదీ తక్కువ పరిమాణంలో వేస్తున్నారు.
» వారానికి ఆరు గుడ్లు(ఎగ్స్) ఇవ్వకపోగా మూడు, నాలుగు గుడ్లతో సరిపెడుతున్నారు.
» రోజువారీ పండ్లు ఇవ్వడం లేదు.
» కొన్నిచోట్ల గడువు తేదీ (ఎక్స్పైరీ డేట్) దాటినా పాల ప్యాకెట్లు వాడుతున్నారు.
» మెనూ, పరిమాణ బోర్డులు ప్రదర్శించడంలేదు.
» మెనూ ప్రకారం ఆహారం అందించడంలేదు.
» వంటశాల, స్టోర్ రూమ్లలో శుభ్రతలేదు.
» సాంబారు తయారీకి కందిపప్పు బదులు శనగపప్పు వాడుతున్నారు.
» రిజిస్టర్లు (స్టాక్, క్యాష్ మొదలైనవి) సరిగా నిర్వహించడంలేదు.


