15 మంది బాధితులకు అత్యవసర చికిత్స
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కల్తీ పాలు తాగి రాజమహేంద్రవరం లోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారుతోంది. డయాలసిస్ చేయించుకుంటున్నా పరిస్థితి మెరుగుపడకపోవడంతో వెంటిలేటర్ పెట్టాల్సి వస్తోంది. కిమ్స్ బొల్లినేని, రెయిన్బో చి్రల్డన్ ఆస్పత్రి, డెల్టా, రవి చైతన్య కిడ్నీ కేర్, రాక్ ఆస్పత్రుల్లో 15 మంది కల్తీ పాల బాధితులకు వైద్యులు అత్యవసర వైద్యం అందిస్తున్నారు.
వారి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి, మరింత మెరుగైన చికిత్స అందించేందుకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందం శనివారం రాజమహేంద్రవరం వచ్చింది. అత్యవసర చికిత్స పొందుతున్న వారిని పరీక్షించి, ఇప్పటివరకూ అందించిన చికిత్స వివరాలు అడిగి తెలుసుకుంది. బాధితులకు ప్రస్తుతం అందిస్తున్న చికిత్స కంటే మెరుగైన చికిత్స అందించడానికి ఏమీ లేదని బృందం చేతులెత్తేసింది.
హైదరాబాద్ కిమ్స్ సీనియర్ కన్సల్టెంట్లు డాక్టర్ సుభాష్ కౌల్ (న్యూరాలజీ), డాక్టర్ వెంకట కృçష్ణ చైతన్య కొడూరి (న్యూరాలజిస్ట్), అపోలో ఆస్పత్రి క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ క్రాంతికుమార్, ఏఐజీ ఆస్పత్రి డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ డాక్టర్ ఆదర్శ్ సింగంశెట్టి ఈ బృందంలో ఉన్నారు.


