వెలిగొండపై బాబు మాటలు 'నీటి మూటలే': ఎమ్మెల్సీ మాధవరావు | Mlc Tumati Madhava Rao Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

వెలిగొండపై బాబు మాటలు 'నీటి మూటలే': ఎమ్మెల్సీ మాధవరావు

Feb 25 2026 8:22 PM | Updated on Feb 25 2026 8:22 PM

Mlc Tumati Madhava Rao Comments On Chandrababu

సాక్షి, తాడేపల్లి: మార్కాపురం పర్యటనలో సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టుపై పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ తూమటి మాధవరావు ధ్వజమెత్తారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టుకు ప్రాణం పోసిందే వైఎస్సార్‌ కుటుంబమని  తేల్చి చెప్పారు. ప్రాజెక్టు ప్రతి అడుగులోనూ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్‌ జగన్ ముద్ర ఉందని  ఆయన స్పష్టం చేశారు.

2004 అక్టోబరు 27న దివంగత నేత వైఎస్సార్‌ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి, రూ.3581 కోట్లతో నిర్మాణానికి శ్రీకారం చుడితే... 2014-19 మధ్య అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రాజెక్టును పూర్తి చేసే అవకాశం ఉన్నా పట్టించుకోలేదని విమర్శించారు. తిరిగి వైఎస్‌ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మొదటి రెండు సొరంగాలను పూర్తి చేసిన మార్చి 6, 2024న జాతికి అంకితం చేసిన విషయాన్ని గుర్తుచేశారు.  మరోవైపు కూటమి ప్రభుత్వం వచ్చి 20 నెలలైనా ఇంతవరకు ఆర్ అండ్ ఆర్ (సహాయ పునరావాస) ప్యాకేజీ ఇవ్వకుండా..  ప్రాజెక్టు పూర్తైందని ప్రకటించడాన్ని ఆయన తప్పు పట్టారు.

సహాయ పునరావాస ప్యాకేజీలో భాగంగా ఇళ్లు కోల్పోయిన 7300 కుటుంబాలకు రూ.1000 కోట్లు అవసరం కాగా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి డీఆర్సీ సమావేశంలో ఆర్ అండ్ ఆర్ ఎప్పుడిస్తారని మేము అడిగితే 2-3 నెలల్లో చెల్లిస్తామని చెప్పి  20 నెలలు గడుస్తున్నా... నేటికీ వారికి పరిహారం అందలేదని నిలదీశారు. మరోవైపు నిర్వాసితులకు   పరిహారం పూర్తిగా చెల్లించామన్న చంద్రబాబు మాటలు పచ్చి అబద్ధమని.. నిజంగా చెల్లిస్తే ప్రాజెక్టును ప్రారంభించకుండా, కేవలం కెనాల్‌ను ఎందుకు ప్రారంభించారని ప్రశ్నించారు. ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే..

ప్రకాశం జిల్లా అభివృద్ధి వైఎస్సార్‌సీపీతోనే
ప్రకాశం జిల్లాకు జరిగిన ప్రతి మేలు వైఎస్‌ జగన్ హయాంలోనే జరిగింది. రామాయపట్నం పోర్టు, ఇండోసోల్ కంపెనీ, వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావడం వంటివి వైఎస్‌ జగన్ చొరవ వల్లే సాధ్యమయ్యాయి. "వ్యవసాయం దండగ" అన్న చంద్రబాబుకు ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు.

లడ్డూ వివాదం - ఫేక్ వీడియోల బాగోతం
శాసనమండలిలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు చెప్పులతో స్వామివారిని అవమానించారని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మేము చెప్పులతో ఉన్న వీడియోలు ఉంటే బయటపెట్టాలని డిమాండ్ చేస్తే, ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. ఆ వీడియోలు ఫేక్ అని ఒప్పుకున్న ప్రభుత్వం, వాటిని ప్రసారం చేసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి పై ఏ చర్యలు తీసుకున్నారని తూమటి మాధవరావు  నిలదీశారు.

Advertisement
 
Advertisement
Advertisement