సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులి వెందులలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. అంతకుముందు.. అనారోగ్యంతో బాధపడుతున్న సింగిల్ విండో మాజీ ఛైర్మన్ ఈశ్వరయ్యను ఆయన నివాసంలో పరామర్శించిన వైఎస్ జగన్.. ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.

కాగా, ఇవాళ.. వేంపల్లె మండలం నందిపల్లిలోని శ్రీ నందీశ్వర ఆలయంలో నిర్వహించిన నూతన విగ్రహ ప్రతిష్ఠ (శ్రీ పార్వతీ దేవి సమేత మహా నందీశ్వర స్వామి వారు), కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమంలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఆలయ అర్చకులు, వేదపండితులు నిర్వహించిన ప్రత్యేక పూజలు, హోమాల్లో సంప్రదాయ దుస్తులు ధరించి పాల్గొని, స్వామివారికి భక్తిశ్రద్దలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వేదపండితుల ఆశీర్వచనం స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేవాలయాలు మన సంస్కృతి, సంప్రదాయాల ప్రతీకలని, భక్తి మార్గం ద్వారా సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందుతాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాల అభివృద్ధి, పునర్నిర్మాణం ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం మరింత విస్తరిస్తుందని తెలిపారు. నూతన విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన ఆలయ కమిటీ ఛైర్మన్ మారం శ్రీకాంత్ రెడ్డిని, కమిటీ సభ్యులను అభినందిస్తూ, ఈ కార్యక్రమం గ్రామ ప్రజల ఐక్యతకు నిదర్శనమని అన్నారు.
గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, శ్రీ నందీశ్వర స్వామివారి కృపాకటాక్షాలు సమస్త ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


