సాక్షి విజయవాడ: తిరుమల శ్రీవారి ప్రతిష్టను దెబ్బ తీసేందుకు కూటమి నేతలు కుట్ర పన్నారని జై భీమ్ రావ్ భారత్ పార్టీ నేత కుట్ర జడ శ్రవణ్ కుమార్ ఆరోపించారు. దేవుడి పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ కుటిలయత్నం చేశారని విమర్శించారు. తిరుపతి లడ్డు వివాదంలో వీరిద్దరే దోషులని వ్యాఖ్యానించారు. ఎన్డీడీబీ రిపోర్టును అడ్డుపెట్టుకుని రాజకీయంగా లబ్ది పొందాలన్న దుర్బుద్ధితో ఇదంతా చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు.
విజయవాడలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హిందువుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా అసెంబ్లీలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాట్లాడారని మండిపడ్డారు. ప్రజల సంపదతో నడిచే శాసనసభ పూర్తి అవాస్తవాలు, అబద్ధాలతో జరిగిందన్నారు. దుర్మార్గమైన, జుగుప్సాకరమైన, ప్రజలను తప్పు దోవ పట్టించే చర్చ అసెంబ్లీలో నిన్న జరిగిందని జడ శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు.
''కన్ను ఆర్పకుండ అబద్దాలు ఆడే వ్యక్తి చంద్రబాబు. అబద్దాలు ఆడడంలో చంద్రబాబుతో పవన్ పోటీ పడుతున్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తమ స్వార్థం కోసం తిరుపతి లడ్డుపై మాట్లాడారు. 164 మంది ఎమ్మెల్యేలు చెప్పినా అబద్ధం అబద్ధమే. పోయే కాలం వచ్చినప్పుడు దేవుడు చెప్పినా వినరు. శ్రీవారి ప్రతిష్టని దెబ్బ తీసింది ఎవరు? దెబ్బ తీస్తుంది ఎవరు? మీ ప్రభుత్వంలో శాంపిల్స్ తీసి గత ప్రభుత్వం మీద నెట్టమని ఏం ధర్మం చెప్పింది?
2024 జూలై 12న నెయ్యి శాంపిల్ తీశారు. శాంపిల్స్ తీసినపుడు ఏ ప్రభుత్వం అధికారంలో వుంది? 5 రోజుల పాటు శాంపిల్ మీ దగ్గర పెట్టుకొని కల్తీ చేశారు. కస్టమర్ ఇచ్చిన శాంపిల్నే తాము పరీక్షించామని ఎన్డీడీబీ తెలిపింది. మీరు ఏవిధంగా రిపోర్ట్ ఇవ్వమని చెప్పారో.. అదే మేము రిపోర్ట్లో పేర్కొన్నాం తప్పా మాకు ఎటువంటి సంబంధం లేదని ఎన్డీడీబీ పేర్కొంది. ఈ రిపోర్ట్కు చట్టబద్దత లేదని.. దీన్నిఎక్కడా బయట పెట్టకూడదు, మాట్లాడకూడదని చెప్పింది. మరి ఈ రిపోర్ట్ను ఆధారంగా చేసుకుని కూటమి నేతలు ఎలా మాట్లాడారు? దేవుడిని రాజకీయాలకు వాడాలనే ఉద్దేశంతో రిపోర్ట్ ఇప్పించుకుని కూటమి ప్రభుత్వం కుట్రలు చేసింది.
తిరుపతి లడ్డూ వివాదంలో కూటమి వొదిలిన బాణం హెరిటేజ్కే గుచ్చుకుంది. హెరిటేజ్ షేర్లు భారీగా పతనమయి, వేల కోట్ల రూపాయల నష్టం వచ్చింది. శీవారిని అప్రదిష్ట పాలు చేసినందుకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, మానసికంగా నష్టపోతారు. హెరిటేజ్, కొన్ని సంస్థలు సప్లే చేస్తున్న పాలు కల్తీనే. దేవుడి పేరుతో రాజకీయాలు చేయడం సరికాదు. కూటమి ప్రభుత్వం మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తోంది. రాజ్యాంగం బద్ధమైన పదవుల్లో ఉన్నవారు కులమతాలకు అతీతంగా వ్యవహరించాలి. కూటమి నేతల బెదిరింపులకు నేను భయపడనని'' జడ శ్రవణ్ కుమార్ అన్నారు.


