2040 నాటికి 5.60 లక్షల మందికి పైగా విద్యార్థులకు అందుబాటులోకి..
దేశంలో ఇప్పటికే 18 విదేశీ యూనివర్సిటీలకు ఆమోదం..
క్యాంపస్లు ఏర్పాటు చేసిన మూడు వర్సిటీలు
మారిన పరిస్థితుల్లో అమెరికా, యూకే, కెనడా తదితర దేశాల్లో ‘ఉన్నత విద్య’కు అనేక అడ్డంకులు
ఫలితంగా స్వదేశంలోనే విదేశీ వర్సిటీల క్యాంపస్లలో విద్యాభ్యాసానికి విద్యార్థుల మొగ్గు
డెలాయిట్ ఇండియా, నైట్ఫ్రాంక్ సంస్థల అధ్యయనంలో వెల్లడి
సాక్షి, అమరావతి: భారతీయ విద్యార్థులకు స్వదేశంలోనే విదేశీ విద్య అందుబాటులోకి వస్తోంది. ప్రపంచ యూనివర్సిటీలు భారత్ బాట పడుతున్నాయి. విదేశీ యూనివర్సిటీల క్యాంపస్లకు అనువైన ఎంపికగా భారత్ మారుతోంది. 2040 నాటికి 5.60 లక్షల మందికి పైగా విద్యార్థులకు మన దేశంలో ఏర్పాటయ్యే విదేశీ యూనివర్సిటీల క్యాంపస్లు సేవలందిస్తాయని డెలాయిట్ ఇండియా, నైట్ఫ్రాంక్సంస్థల సంయుక్త అధ్యయనం వెల్లడించింది. అలాగే ఏకంగా 113 బిలియన్ డాలర్ల విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుందని తెలిపింది.
40 భారతీయ నగరాలకు సామర్థ్యం..
విదేశీ వర్సిటీలకు ఆతిథ్యం ఇవ్వగల సామర్థ్యం 40 భారతీయ నగరాలకు ఉందని నివేదిక స్పష్టం చేసింది. వీటిలో ఢిల్లీ, బెంగళూరు, ముంబై టాప్లో ఉన్నాయి. ఇక్కడ పరిశోధనకు అనువైన వాతావరణం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతుల రాకకు అనుకూలంగా ఉండటం, మౌలికవసతులు, పరిశ్రమ–విద్య అనుసంధానం వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
అడ్డంకులను అధిగమిస్తూ..
అధ్యయనం ప్రకారం.. ఉన్నత విద్య చదివే వయసున్న యువత కలిగిన దేశంగా భారత్ టాప్లో ఉంది. ప్రస్తుతం దేశంలో 15.50 కోట్ల మంది ఉన్నత కళాశాలల స్థాయి యువత ఉండగా.. 2030 నాటికి వారి సంఖ్య 16.50 కోట్లకు పెరుగుతుందని అంచనా. ఈ నేపథ్యంలో 2035 నాటికి విద్యార్థుల స్థూల నమోదును ప్రస్తుత స్థాయి నుంచి 50 శాతానికిపెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.
మరోవైపు దేశీయ ఉన్నత విద్య సామర్థ్యం సరిపోవట్లేదని భావించిన విద్యార్థులు అమెరికా, యూకే, కెనడా, ఆ్రస్టేలియా తదితర దేశాలు వెళ్తుండేవారు. మారిన పరిస్థితుల్లో ఆయా దేశాలు వీసా నియమాలను కఠినతరం చేస్తుండడంతో భారత విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పైగా పెరుగుతున్న ఖర్చులు కూడా వారికి అడ్డంకిగా మారాయి. ఈ నేపథ్యంలో భారత్లోనే తమ క్యాంపస్ల ఏర్పాటుకు ప్రపంచ వర్సిటీలు ముందుకొస్తున్నాయి.
విదేశీ వర్సిటీల ఏర్పాటుకు వెసులుబాటు..
నూతన విద్యా విధానం తర్వాత దేశంలో ఉన్నత విద్యాసంస్థలను స్థాపించాలనుకునే విదేశీ వర్సిటీలకు వెసులుబాటు లభించింది. విదేశీ వర్సిటీల ఆఫ్షోర్ క్యాంపస్లు, జాయింట్ వెంచర్లు, ట్రాన్స్నేషనల్ ఎడ్యుకేషన్ మోడల్స్ ద్వారా భారత్లో స్వతంత్రంగా పని చేయడానికి కేంద్ర ప్రభుత్వం బహుళ మార్గాలను కల్పించింది. వీటిలో పన్ను ప్రోత్సాహకాలు, సింగిల్ విండో క్లియరెన్స్ తదితరాలున్నాయి.
ఫలితంగా 18 విదేశీ యూనివర్సిటీలు భారత్లో తమ క్యాంపస్ల ఏర్పాటుకు సూత్రప్రాయ ఆమోదం పొందాయి. ఇందులో ఆ్రస్టేలియాకు చెందిన డీకిన్, వోలోన్గాంగ్ వర్సిటీలు గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ(గిఫ్ట్సిటీ)లో, యూకేకు చెందిన సౌతాంప్టన్ వర్సిటీ గురుగ్రామ్లో తమ క్యాంపస్లు ప్రారంభించాయి.


